న్యూఢిల్లీ: హత్రాస్ ఘటనలో నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, వారి మద్దతుదారులు ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. హత్రాస్ బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారికి మద్దతుగా ప్రతిపక్ష పార్టీల నాయకులతో సహా వందలాది మంది ప్రజలు అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్కడకు చేరుకుని వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘మేమంతా ఎంతో బాధతో ఇక్కడ సమావేశం అయ్యాం. మా కుమార్తె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. దోషులను వీలైనంత త్వరగా ఉరి తీయాలని యూపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అన్నారు. (చదవండి: ‘వారు రైతుల పక్షాన పోరాడారు’)
ఇక భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్.. ‘హత్రాస్ను సందర్శిస్తాను. యూపీ సీఎం రాజీనామా చేసేవరకు నా పోరాటం కొనసాగుతుంది. బాధితురాలికి న్యాయం జరిగే వరకు నేను వెనకడుగు వేయను. ఈ ఘటనను పరిశీలించాల్సిందిగా సుప్రీం కోర్టును కోరుతున్నాను’ అన్నారు. సూర్యాస్తమయం తర్వాత నిరసనకారులు కొవ్వొత్తులను వెలిగించి చీకటిలో పట్టుకుని నిలబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment