
న్యూయార్క్: దాయాది దేశం పాకిస్తాన్కు భారత్ చుక్కలు చూపిస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ తీరును ప్రపంచ వేదికలపై భారత్ ప్రశ్నిస్తూ.. దాయాదిని ఇరుకునపెడుతోంది. తాజాగా ఐక్యరాజ్యసమితిలో పాక్ రాయబారి అసిమ్ ఇఫ్తికర్ అహ్మద్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. అంతటితో ఆగకుండా.. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది.
ఐక్యరాజ్యసమితిలో సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా పాక్ రాయబారి పై వ్యాఖ్యలు చేశారు. అనంతరం, ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్.. పాకిస్తాన్కు కౌంటరిచ్చారు. హరీశ్ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదులకు, పౌరులకు మధ్య తేడా చూపని పాకిస్తాన్కు ప్రజల ప్రాణాలను రక్షించడం గురించి మాట్లాడే అర్హత లేదు. పాక్ ప్రతినిధి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. భారత్ దశాబ్దాలుగా పాక్ ప్రాయోజిత ఉగ్రవాదులతో పోరాడుతోంది.
26/11 ముంబై దాడుల నుంచి ఇటీవల పహల్గాంలో అమాయక పర్యాటకులపై ఉగ్ర దాడులు చేశారు. పౌరులే ప్రధాన లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. పహల్గాం దాడికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సిందూర్ను నిర్వహించి పాక్లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో మృతిచెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు ఆ దేశ సీనియర్ ప్రభుత్వ, పోలీసు, సైనిక అధికారులు హాజరై నివాళులర్పించడం చూశాం. ఉగ్రవాదులు, పౌరుల మధ్య తేడాను గుర్తించని ఆ దేశానికి మమ్మల్ని విమర్శించే అర్హత లేదు. భారత పౌరులే లక్ష్యంగా పాక్ దాడులు చేసింది. గురుద్వారాలు, దేవాలయాలు, సైనిక స్థావరాలను కావాలనే లక్ష్యంగా చేసుకుంది. ఇలాంటి పనులు చేస్తూ బోధనలు చేయడం హాస్యాస్పదం అంటూ చురకలు అంటించారు.
#IndiaAtUN
PR @AmbHarishP delivered India’s statement at the Arria Formula Meeting on Protecting Water in Armed Conflict – Protecting Civilian Lives. @MEAIndia @UN pic.twitter.com/SV0wzzW5XS— India at UN, NY (@IndiaUNNewYork) May 23, 2025
భారత్ ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. 65 సంవత్సరాల క్రితం సింధు జల ఒప్పందంలోకి చిత్తశుద్ధితో ప్రవేశించింది. ఒప్పందంపై స్పూర్తితో, స్నేహ భావంతోనే ఇన్ని రోజులు ఉంది. ఆరున్నర దశాబ్దాలుగా భారత్పై పాకిస్తాన్ మూడు యుద్ధాలు చేసింది. ఉగ్రదాడులకు పాల్పడింది. సింధు జలాల ఒప్పందం స్పూర్తిని ఉల్లంఘించింది. నాలుగు దశాబ్దాలలో 20,000 మందికి పైగా భారతీయులు ఉగ్రవాద దాడుల్లో మరణించారు అని చెప్పుకొచ్చారు.