పాక్‌కి వెళ్లి మరీ మట్టుపెడతాం: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ | India Will Enter Pak To Kill Terrorists Who Flee There, Says DM Rajnath | Sakshi
Sakshi News home page

అదే జరిగితే.. పాక్‌కి వెళ్లి మరీ మట్టుపెడతాం: రక్షణమంత్రి హెచ్చరికలు

Published Sat, Apr 6 2024 7:51 AM | Last Updated on Sat, Apr 6 2024 9:00 AM

India Will Enter Pak Kill Terrorists Who Flee There Says DM Rajnath - Sakshi

మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో ముఖ్యంగా పాకిస్థాన్‌లో భారత వ్యతిరేకులుగా భావిస్తున్న వారిని హతమార్చే కొత్త ధోరణి మొదలైంది.

న్యూఢిల్లీ:  ఉగ్రవాదాన్ని భారత్‌ సహించబోదని.. అవసరమైతే పాకిస్థాన్‌ భూభాగంలోకి చొరబడి మరీ ఉగ్రవాదుల్ని మట్టుపెడుతుందని దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరించారు. బ్రిటన్‌ పత్రిక గార్డియన్‌ తాజాగా భారత్‌పై ఆరోపణలతో కూడిన ఓ కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ స్పందిస్తూ.. 

పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెరపాలనే భారత్‌ ఎప్పుడూ కోరుకుంటుంది. కానీ, ఉగ్రవాదుల చర్యలను ప్రతీసారి భారత్‌ ఉపేక్షించదు. భారత్‌లోకి చొరబడి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం.. ఈ దేశ ఆగ్రహం ఎలా ఉంటుందో వాళ్లు చవిచూడాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్లు(ఉగ్రవాదులు) భారత్‌లో దాడులకు పాల్పడి పాకిస్థాన్‌లోకి గనుక పారిపోతే.. వెంటాడుతాం. ఆ భూభాగంలోకి వెళ్లి మరీ మట్టుపెడతాం. మాకు(భారత సైన్యానికి) ఆ సామర్థ్యం ఉంది. అది చేసి తీరతాం కూడా. పొరుగు దేశం(పాక్‌) కూడా అది గుర్తిస్తే మంచిది’’ అని కేంద్ర రక్షణ మంత్రి స్పష్టం చేశారు. 

ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌లో వరుసగా ఉగ్రవాద నేతలు చనిపోతున్నారు. అయితే వాళ్లంతా అనుమానాస్పద రీతిలో.. గుర్తు తెలియని దాడుల్లో మృతి చెందడం గమనార్హం. దీంతో.. ఇందులో ఒక ప్లాన్‌ ప్రకారమే ఈ హత్యలు జరుగుతున్నాయంటూ ప్రపంచవ్యాప్తంగా చర్చ సైతం నడిచింది. ఈ లోపు గార్డియన్‌ పత్రిక.. 

‘‘విదేశాల్లోని ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్‌లో ముష్కరులను భారత ఇంటర్నేషనల్‌ నిఘా ఏజెన్సీ హత్యలు చేస్తోంది. ఖలిస్థానీలను కూడా టార్గెట్‌గా చేసుకుంది. మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో ముఖ్యంగా పాకిస్థాన్‌లో భారత వ్యతిరేకులుగా భావిస్తున్న వారిని హతమార్చే కొత్త ధోరణి మొదలైంది. 2020 నుంచి 2023 వరకు దాదాపు 20 మంది ఈ విధంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యలన్నీ భారత గూఢచార సంస్థ ‘రీసెర్చ్‌ అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్‌’ (రా) పర్యవేక్షణలో జరిగాయి. ఈ మేరకు భారత్‌, పాకిస్థాన్‌ నిఘా, గూఢచార సంస్థల అధికారులతో మా (గార్డియన్‌) ప్రతినిధి మాట్లాడి వివరాలు సేకరించారు’’ అని పెద్ద కథనం ప్రచురించింది ది గార్డియన్‌. అయితే, ఈ హత్యల్లో తమ ప్రమేయం లేదని, ఇది భారత వ్యతిరేక దుష్ప్రచారమని భారత విదేశాంగశాఖ పేర్కొన్నట్లుగా కూడా గార్డియన్‌ ప్రస్తావించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement