
భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షలాది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. రైలు టికెట్ బుకింగ్, రైలు ట్రాకింగ్, ఫుడ్ ఆర్డర్ చేయడం, ఫిర్యాదు చేయడం... ఇలా అన్ని సేవలను ఒకే చోట ప్రయాణికులకు అందించేందుకు భారతీయ రైల్వే కొత్త సూపర్ యాప్ను రూపొందిస్తోంది.
ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే రైల్వే విభాగం అందించే అన్ని సేవలను ఒకే చోట పొందవచ్చు. ఇన్నాళ్ల మాదిరిగా ప్రయాణికులు వేర్వేరు యాప్లపై అధారపడనవసరం లేదు. ఈ యాప్ ప్రాజెక్టును రైల్వే ఐటి వింగ్, సీర్ఐఎస్ పర్యవేక్షిస్తున్నదని రైల్వే విభాగానికి చెందిన ఒక అధికారి తెలిపారు.
రైల్ మదద్, యూటీఎస్, నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్, పోర్ట్రెయిట్, విజిలెంట్ తనిఖీ కార్యకలాపాల టీఎంఎస్, ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్, ఐఆర్సీటీసీ ఈ-కేటరింగ్, ఐఆర్సీటీసీ ఎయిర్ మొదలైన సేవలన్నీ కొత్త సూపర్ యాప్లో విలీనం కానున్నాయి. ఈ యాప్ అందుబాటులోకి వచ్చాక కోట్లాది మంది రైల్వే వినియోగదారులు ప్రత్యేక మొబైల్ యాప్లను డౌన్లోడ్ చేసుకోనవసరం లేదు.
రైల్వేకు సంబంధించిన అనేక పనులు ఇక వినియోగదారులకు సులభతరం కానున్నాయి. రైల్వే విభాగానికి ఈ సూపర్ యాప్ తయారీకి దాదాపు రూ. 90 కోట్ల ఖర్చు కానుంది. మూడు సంవత్సరాలలో ఈ యాప్ అందుబాటులోకి రానుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో రైల్వేలు అందుకున్న మొత్తం బుకింగ్లలో దాదాపు 5,60,000 బుకింగ్లు (సగానికి పైగా) ఐఆర్సీటీసీ యాప్ ద్వారా అందాయి.
Comments
Please login to add a commentAdd a comment