కోలాహలంగా జాతర జరుగుతుందనుకున్న టైంలో.. ఒక్కసారిగా అలజడి రేగింది. జనాలు ఉరుకులు పరుగులతో చెల్లాచెదురయ్యారు. ఈ క్రమంలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. అందుకు కారణం.. రెండు గజరాజులు తలపడడమే!.
కేరళ త్రిస్సూర్ జిల్లాలో తరక్కల్ ఆలయ ఉత్సవాల ముగింపు జాతరలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. జాతర ముగింపు సమయంలో అమ్మవారిని ఉరేగిస్తున్న ఏనుగు.. ఒక్కసారిగా అలజడి సృష్టించింది. మావటి మీద మూడుసార్లు దాడికి యత్నించగా.. ఆయన స్వల్ప గాయాలతో తృటిలో తప్పించుకున్నాడు. అయితే ఆ ఏనుగు అక్కడితో ఆగలేదు. అక్కడే ఉరేగింపు కోసం తీసు కొచ్చిన మరో ఏనుగుపై దాడికి దిగింది.
ఈ క్రమంలో ఆ రెండు తలపడడంతో.. అక్కడ భీతావహ పరిస్థితి ఏర్పడింది. ఆ ఏనుగుల మీద ఉన్నవాళ్లు కింద పడి గాయాలపాలయ్యారు. ఏనుగుల పోరాటంతో భయపడి.. ఉరుకులు పరుగులు పెట్టడంతో కిందపడి చాలా మందికి సైతం దెబ్బలు తగిలించుకున్నారు. అతికష్టం మీద మొదటి ఏనుగును మావటివాళ్లు నిలువరించగలిగారు. అయితే గాయపడ్డ ఏనుగు కిలోమీటర్ దూరం పరుగులు తీయగా.. అతికష్టం మీద మావటివాళ్లు దానిని పట్టుకోగలిగారు. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.