‘పాపం.. ఆ పసి మనసుకేం తెలుసు!’ | Kid Crying For Kidnapper Fact Check Behind Emotional Viral Story | Sakshi
Sakshi News home page

‘పాపం.. ఆ పసి మనసుకేం తెలుసు!’ వైరల్‌ స్టోరీ వెనుక అసలు నిజం ఏంటంటే..

Published Sat, Aug 31 2024 7:35 AM | Last Updated on Sat, Aug 31 2024 10:48 AM

Kid Crying For Kidnapper Fact Check Behind Emotional Viral Story

Viral Story: సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే కథనాలకు తలాతోక ఉండదు. నిజనిర్ధారణ(Fact Check) చేసుకోకుండా పోస్టులు పెడుతుంటారు కొందరు. అలాగే.. ఆ పోస్టుల ఆధారంగా మీమ్స్‌ సైతం వస్తున్న రోజులివి. తాజాగా సిసింద్రీ క్లైమాక్స్‌ను గుర్తు చేస్తోందంటూ ఓ ఘటన నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

వైరల్‌ వీడియోలో ఏముందంటే..
పోలీస్‌ స్టేషన్‌లో.. ఓ వ్యక్తి చెర నుంచి రెండేళ్ల ఓ చిన్నారిని విడదీస్తారు పోలీసులు. ఆ టైంలో ఆ చిన్నారి ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకుంటాడు. అయినా పోలీసులు బలవంతంగా లాక్కుంటారు. ఆ చిన్నారి ఏడుపుతో పాటు కిడ్నాపర్‌ కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. అలా ఆ బిడ్డను బయటకు తీసుకెళ్లాక.. ఓ మహిళకు అప్పగిస్తారు. ఆమెతో పాటు ఓ వ్యక్తి, వృద్ధజంటను ఆ బాలుడి గురించి ఆరా తీస్తారు. అయినా ఆ చిన్నారి లోపల ఉన్న కిడ్నాపర్‌ కోసం గుక్కపట్టి ఏడుస్తూనే ఉంటాడు.

అయితే ఆ బిడ్డకు అతనే తండ్రి అని, విడిపోయిన నేపథ్యంలో భార్య అతనిపై కేసు పెట్టిందని ఓ ప్రచారం జరుగుతోంది. అలాగే.. కిడ్నాపర్‌ మీద మమకారం పెంచుకుని అలా ఆ చిన్నారి ఏడ్చాడంటూ మరో ప్రచారం జరుగుతోంది. కానీ, ఇందులో ఏది నిజమంటే..

అసలు విషయం ఏంటంటే..
ఆ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు తనూజ్‌ చాహర్‌(33).ఆ  వీడియోలో ఉన్న చిన్నారి పేరు పృథ్వీ. ఆగ్రాకు చెందిన తనూజ్‌ గతంలో  అలీఘడ్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేశాడు. కారణం తెలియదుగానీ.. అతను సస్పెన్షన్‌లో ఉన్నాడు. అయితే.. ఆ చిన్నారి తల్లి పూనమ్‌ చౌదరితో అతనికి పరిచయం ఉంది. ఈ క్రమంలో తనతో వచ్చేయాలని ఆమెపై ఒత్తిడి చేశాడతను. ఆమె ఒప్పుకోకపోవడంతో.. కోపం పెంచుకుని ఆమె 11 నెలల కొడుకును ఎత్తుకెళ్లాడు.

అలా సుమారు 14 నెలలపాటు ఆ బిడ్డతో ఎవరికీ దొరక్కుండా తిరిగాడు తనూజ్‌. పోలీసుగా తనకు ఉన్న అనుభవం ఉపయోగించడంతో పాటు ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు గడ్డం పెంచుకుని తిరిగాడు. ఆ బిడ్డను తన బిడ్డగా అందరికీ చెప్పుకుంటూ.. మధుర, ఆగ్రా, బృందావన్‌.. అన్నిచోట్లా తిరిగాడు. యమునా నది తీరాన ఓ గుడిసె వేసుకుని తనను తాను ఓ సాధువుగా  అందరినీ నమ్మించే యత్నం చేశాడు. చివరకు ఈ మధ్య అలీగఢ్‌లో అతని జాడను గుర్తించిన జైపూర్‌ పోలీసులు.. 8 కిలోమీటర్లపాటు ఛేజ్‌ చేసి పట్టుకున్నాడు.

తల్లిదండ్రులకు దూరం చేసిన ఆ వ్యక్తితో ఏడాది పాటు ఉన్న పృథ్వీ.. ఇన్నాళ్లు తనని సాకినందుకు ఆ కిడ్నాపర్‌పైనే మమకారం పెంచుకుని రోదిస్తుండడం ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement