
అహ్మదాబాద్: ఆగి ఉన్న వాహనాన్ని మినీ ట్రక్కు ఢీకొన్న ఘటనలో 10 మంది చనిపోగా మరో 13 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘోర ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఖేడా జిల్లా కపడ్వంజ్ తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన 23 మంది సురేంద్రనగర్ జిల్లా చోటిలాలో జరిగిన మతపరమైన కార్యక్రమానికి వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో వారి వాహనం శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో బగోదర సమీపంలో రాజ్కోట్–అహ్మదాబాద్ హైవేపై రోడ్డు పక్క ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా మరో 13 మంది గాయపడినట్లు ఎస్పీ అమిత్ వాసవ తెలిపారు. ఘోర ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం ప్రకటించారు.