Lok sabha elections 2024: విరాళాల సమస్త వివరాలు బహిర్గతం | Lok sabha elections 2024: SBI discloses all details of Electoral Bonds to ECI | Sakshi
Sakshi News home page

Lok sabha elections 2024: విరాళాల సమస్త వివరాలు బహిర్గతం

Published Fri, Mar 22 2024 4:58 AM | Last Updated on Fri, Mar 22 2024 4:58 AM

Lok sabha elections 2024: SBI discloses all details of Electoral Bonds to ECI - Sakshi

ఈసీకి సమర్పించిన ఎస్‌బీఐ

వెంటనే తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన కేంద్ర ఎన్నికల సంఘం

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో భారతీయ స్టేట్‌ బ్యాంక్‌(ఎస్‌బీఐ) నుంచి ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలన్నీ వాటి నంబర్లతో సహా పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘానికి చేరాయి. దీంతో ఆ సమస్త వివరాలను ఈసీ వెంటనే తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆల్ఫా–న్యూమరిక్‌ నంబర్లతోసహా దాతలు, వాటిని అందుకున్న గ్రహీతల(రాజకీయ పార్టీలు) జాబితాను విడివిడిగా ఈసీ పొందుపరిచింది. ఆల్ఫా–న్యూమరిక్‌ నంబర్లను బట్టి ఏ ఎలక్టోరల్‌ బాండ్‌ మొత్తాన్ని ఈ రాజకీయ పార్టీ విరాళంగా పొందిందో సులభంగా తెల్సుకోవచ్చు.

సుప్రీంకోర్టు గత ఆదేశాల సమయంలో ఈ ఆల్ఫా–న్యూమరిక్‌ నంబర్లు లేకుండానే బాండ్లు, వాటి గ్రహీతల జాబితాను ఈసీకి ఎస్‌బీఐ ఇచ్చింది. ఏ వ్యక్తి/సంస్థ బాండ్లను ఏ పార్టీకి విరాళంగా ఇచ్చారని తెలిపే ఈ నంబర్లు లేకపోవడంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బ్యాంకు తీరుపై అసహనం వ్యక్తంచేసింది. సమస్త వివరాలను ఈసీకి ఇవ్వాలని ఆదేశించడంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ఎస్‌బీఐ గురువారం ఆల్ఫా–న్యూమరిక్‌ నంబర్లతో కూడిన పూర్తి వివరాలను ఈసీకి అందజేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది.  

రిలయన్స్‌ సంబంధ సంస్థ నుంచి బీజేపీకి రూ.395 కోట్లు
ఈసీ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో సంబంధం ఉన్న క్విక్‌ సప్లై చైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ బీజేపీకి రూ.395 కోట్ల విరాళాలు ఇచ్చింది. 2022లో శివసేన
పార్టీకి రూ.25 కోట్ల విరాళాలు అందజేసింది. 2021–22, 2023–24కాలంలో బాండ్లు కొని విరాళంగా ఇచి్చన మూడో అతిపెద్ద దాతగా క్విక్‌ సప్లై చైన్‌ నిలిచింది. ఈకాలంలో ఈ సంస్థ రూ.410 కోట్ల బాండ్లను కొనుగోలుచేసింది. అత్యధికంగా ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీసెస్‌ సంస్థ రూ.1,368 కోట్ల బాండ్లను కొనుగోలుచేయడం తెల్సిందే.

ఈ సంస్థ 2022 అక్టోబర్‌ వరకు మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీపార్టీకి రూ.540 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఈ సంస్థ నుంచి అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా టీఎంసీ నిలిచింది. ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌హోటల్‌ సర్వీసెస్‌ నుంచి బీజేపీ రూ.100 కోట్ల విరాళాలు పొందింది. ఈ సంస్థ కాంగ్రెస్‌కు రూ.50 కోట్ల విరాళం ఇచ్చింది.  సిక్కిం క్రాంతికారీ మోర్చా సైతం ఈ సంస్థ నుంచి విరాళాలు స్వీకరించింది. తమిళనాడులోని డీఎంకేకు ఈ సంస్థ ఏకంగా రూ.509 కోట్ల విరాళాలు ఇచ్చింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో సంబంధం ఉన్న హానీవెల్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సైతం రూ.30 కోట్ల బాండ్లను కొని మొత్తం బీజేపీకే విరాళంగా ఇచ్చింది.

ఈసీకి ఇచ్చేశాం: ఎస్‌బీఐ
ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలన్నీ వాటి నంబర్లతో సహా ఎన్నికల సంఘానికి అందజేశామని ఎస్‌బీ ఐ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్‌బీఐ చైర్మన్‌ దినేశ్‌కుమార్‌ ఖరా గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. దాతలు ఇచ్చిన బాండ్లను నగదుగా మార్చుకున్న రాజకీయ పార్టీల బ్యాంక్‌ ఖాతాల నెంబర్లు, కేవైసీ వివరాలను బయటపెట్టడం లేదని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement