'హర్ హర్ మహాదేవ్' సినిమా ప్రదర్శన నిలిపివేత.. ఎమ్మెల్యే అరెస్ట్
Published
Fri, Nov 11 2022 4:52 PM
సాక్షి, ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవద్ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మరాఠీ చిత్రం ‘హర్ హర్ మహదేవ్’ సినిమా ప్రదర్శనకు అంతరాయం కలిగించినందుకు అయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎన్సీపీ నేత అవద్, తన అనుచరులతో కలిసి థానే నగరంలోని ఓ మల్టిప్లెక్స్లోకి బలవంతంగా ప్రవేశించారు. ‘హర్ హర్ మహాదేవ్’ సినిమాలో చరిత్రను వక్రీకరించారంటూ ఆరోపిస్తూ స్క్రీనింగ్ను అడ్డుకున్నారు. అంతేగాక సినిమా చూస్తున్న ప్రేక్షకులపై దాడి చేశారు.
దీనిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. హర్ హర్ మహాదేవ్ చూసినందుకు సినిమా ప్రేక్షకులను కొట్టడాన్ని సహించేది లేదని మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే తాను సినిమా చూడలేదని, ఈ వివాదం గురించి తెలియదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ వ్యతిరేకతను తెలియజేసేందుకు అనుమతి ఉంది కానీ, ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించకూడదని ఫడ్నవీస్ హెచ్చరించారు. చదవండి: Gyanvapi Mosque Case: శివలింగం బయటపడిన ప్రాంతాన్ని పరిరక్షించాలి: సుప్రీం