
న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం ఉదయం యోగా డే వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్లారాయన. అయితే అక్కడ ఆయనకు నల్లజెండాలతో విద్యార్థులు స్వాగతం పలికారు.
నీట్, యూసీజీ-నెట్ పరీక్షలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ యోగా డే కార్యక్రమం కోసం వెళ్లిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను విద్యార్థులు అడ్డుకునే యత్నం చేశారు. నల్లజెండాలతో అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పోలీసులు అప్పటికే బారికేడ్లను ఏర్పాటు చేయగా.. వాటిని తోసుకుంటూ ముందుకు వచ్చే యత్నం చేశారు. ఈ నిరసనలతో ఆయన యోగా డేలో పాల్గొనకుండానే వెనక్కి వెళ్లిపోయారు.
ఇదీ చదవండి: నీట్ పేపర్ లీకేజీ నిజమే
మరోవైపు.. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై నిరసనగా ధర్మేంద్ర ప్రధాన్ నివాసం బయట ఈ ఉదయం యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు.
ఇదిలా ఉంటే.. యూజీసీ నెట్ను రద్దు చేసిన కేంద్రం, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు నీట్ అవకతవకలపై దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో నిన్న ధర్మేంద్ర ప్రధాన్ ప్రెస్ మీట్ నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజీ పడబోమంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇవాళ కూడా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. దీంతో కీలక ప్రకటన ఏదైనా వెలువడే అవకాశం లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment