
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాటన్ క్యాండీ (తీపి తినుబండారం) విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ ప్రకటించారు. విషపూరిత రసాయనాలను ఉపయోగించి కాటన్ క్యాండీలను తయారు చేస్తున్నారనే కారణంతోనే వీటిపై నిషేధం విధించారు.
ఒక వీడియోలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ మాట్లాడుతూ కాటన్ క్యాండీలో విషపూరిత రోడోమైన్ బీ ఉన్నట్లు ఆహార అధికారులు కనుగొన్నారన్నారు. కాటన్ క్యాండీలలోని విష రసాయనాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. అందుకే పుదుచ్చేరిలో కాటన్ క్యాండీ విక్రయాలను నిషేధిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు.
குழந்தைகளின் உடல்நலத்தை பாதிக்கும் ரசாயனம் கலந்த பஞ்சு மிட்டாயை குழந்தைகளுக்கு வாங்கி கொடுக்காதீர்கள்.#CottonCandy #PanchuMittai #Puducherry pic.twitter.com/VJR451Y403
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 8, 2024
లెఫ్టినెంట్ గవర్నర్ తన అధికారిక సోషల్ మీడియా పేజీలో దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ షేర్ చేశారు. పిల్లల కోసం కాటన్ క్యాండీలను కొనుగోలు చేయడం మానుకోవాలని, అందులోని రసాయనాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని తెలిపారు. కాటన్ క్యాండీలు విక్రయించే అన్ని దుకాణాలలో తనిఖీ చేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ ఆ వీడియోలో తెలిపారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తెలిపిన వివరాల ప్రకారం, రోడోమైన్ బీ అనే రసాయనాన్ని ఆహార పదార్థాలకు రంగు వచ్చేందుకు ఉపయోగిస్తారు. ఇది శరీరంలోకి ప్రవేశించినప్పుడు కణాలలో ఆక్సీకరణ ఉద్రిక్తతకు కారణమవుతుంది. ఫలితంగా కాలేయ వైఫల్యం, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేందుకు అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment