
లక్నో: అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి బాల రాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం తొలి రామనవమి వేడుకలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 17న జరిగే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
రామ నవమి సందర్భంగా 1,11,111 కిలోల లడ్డూలను అయోధ్యలోని రామాలయానికి ప్రసాదంగా పంపి భక్తులకు పంపిణీ చేయనున్నట్లు దేవ్రహ హన్స్ బాబా ట్రస్ట్ ట్రస్టీ అతుల్ కుమార్ సక్సేనా తెలిపారు. కాశీ విశ్వనాథ ఆలయం సహా దేశంలోని పలు ఆలయాలకు ప్రతి వారం లడ్డూ ప్రసాదాన్ని పంపుతున్నట్లు ఆయన చెప్పారు. జనవరి 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ రోజున కూడా దేవ్రహ హన్స్ బాబా ఆశ్రమం 40 వేల కిలోల లడ్డూను నైవేద్యంగా పంపినట్లు తెలిపారు.
ప్రధాని మోదీ గత జనవరి 22న అయోధ్య రామాలయంలో రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమం జరగుతుండగా ఆర్మీ హెలికాప్టర్లు ఆలయంపై పూలవర్షం కురిపించాయి. ఆరోజు మొదలుకొని అయోధ్యలో సందడి కొనసాగుతోంది. ఏప్రిల్ 17న రామ నవమి సందర్భంగా ఆలయ తలుపులు మూడు రోజుల పాటు 24 గంటలూ తెరచి ఉండనున్నాయి. నైవేద్యం సమర్పించేటప్పుడు, అలంకారం చేసేటప్పుడు మాత్రమే తలుపులు మూసివేయనున్నారు. శ్రీరాముని జన్మదినోత్సవ వేడుకలకు అయోధ్యకు వచ్చే రామభక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment