స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట భద్రత
భీమవరం: భీమవరం పట్టణంలోని ఎస్ఆర్కెఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూంలను ఎస్పీ వేజెండ్ల అజిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల పరిసరాలు, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించిన అనంతరం సీసీ కెమెరాల పనితీరు, డ్యూటీ రికార్డులు స్వయంగా తనిఖీ చేసి విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఎస్పీ అజిత మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట భద్రత చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో ఏర్పాటు చేసిన పటిష్టమైన మూడంచెల భద్రతలో భాగంగా మొదటి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు, రెండో అంచెలో ఆర్మ్డ్ రిజర్వ్ బలగాలు, మూడో అంచెలో స్థానిక సివిల్ పోలీసుల్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈవీఎం స్ట్రాంగ్ రూంలు, సెక్యూరిటీ, కారిడార్, సీల్డ్ వేసిన డోర్లను కవర్ చేసేలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను, కంట్రోల్ రూంకు అనుసంధానం చేసిన సీసీటీవీ కవరేజీతో సహా భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణకు గెజిటెడ్ అధికారులతో పాటు పోలీసు అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు. స్ట్రాంగ్ రూం ఎంట్రన్స్ గేట్ పరిసరాలలోకి గుర్తింపు కార్డులు లేని వ్యక్తులను, ఇతరుల వాహనాలకు అనుమతించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఏపీ ఈఏపీ సెట్ భీమవరం: భీమవరం పట్టణంలోని మూడు ఇంజినీరింగ్ కళాశాలల్లో శనివారం జరిగిన ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం జరిగిన పరీక్షకు 175 మందికి 168 మంది హాజరయ్యారు. డీఎన్నార్ కళాశాలలో 150 మందికి ఇద్దరు విద్యార్థులు గైర్హాజరు కాగా.. విష్ణు కళాశాలలోని పరీక్షకు 100 మందికి 97 మంది హాజరయ్యారు. 460 మంది హాజరు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల్లో భాగంగా శనివారం నగరంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షకు మొత్తం 460 మంది హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ జరిగిన పరీక్షకు సిద్ధార్థ క్వెస్ట్ కాలేజ్లో 180 మందికి 174 మంది హాజరు కాగా ఆరుగురు గైర్హాజరయ్యారు. ఏలూరు ఇంజినీరింగ్ కళాశాలలో 132 మందికి 129 మంది హాజరు కాగా ముగ్గురు గైర్హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 160 మందికి 157 మంది హాజరు కాగా ముగ్గురు గైర్హాజరయ్యారు. మొత్తం మీద ఉదయం సెషన్లో 472 మందికి 460 మంది హాజరు కాగా 12 మంది గైర్హాజరయ్యారు. శనివారం మధ్యాహ్నం సెషన్లో ఏ పరీక్షా కేంద్రంలోనూ పరీక్ష నిర్వహించలేదు. రైళ్ల రద్దుతో ఇక్కట్లు
పాలకొల్లు సెంట్రల్: నరసాపురం నుంచి గుంటూరు వరకూ వెళ్లే పాస్ట్ ప్యాసింజర్, డెమో రైళ్ల రద్దుతో పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విజయవాడ డివిజన్ రైల్వే డీఆర్యుసీసీ సభ్యుడు జక్కంపూడి కుమార్ విజయవాడ డీఆర్ఎంకు లేఖ రాశారు. తూర్పు గోదావరి జిల్లా ప్రజలతోపాటు నరసాపురం, పాలకొల్లు, భీమవరం, కై కలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రద్దు చేసిన రైళ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. 11వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
బుట్టాయగూడెం: మండలంలోని ఇప్పలపాడు సమీపంలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలో 2024–25 విద్యా సంవత్సరానికి 11వ తరగతి(సీబీఎస్ఈ)లో వివిధ గ్రేడ్ల్లో (ఎంపీసీ, బైపీసీ, ఏఎస్పి)మిగిలిన ఖాళీలకు 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 18 నుంచి 25 వరకూ దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ బి.అమృత్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.