
భోపాల్: బిహార్లో ఓ ప్రయాణికుల రైలుకు భారీ ప్రమాదం తప్పింది. ముజఫర్పూర్లో ముంబయి వెళ్లే పవన్ ఎక్స్ప్రెస్ చక్రం విరిగి 10 కిలోమీటర్ల వరకు ప్రయాణించడమే అందుకు కారణం. ఆదివారం అర్థరాత్రి భగవాన్పూర్ రైలు వద్ద ముజఫర్పూర్-హాజీపూర్ రైలు సెక్షన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్పూర్ రైల్వే స్టేషన్ నుండి పవన్ ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరింది. కాస్త దూరం ప్రయాణించి తర్వాత ప్యాసింజర్లకు S-11 కోచ్లో పెద్ద శబ్దాలు వినిపించాయి.
భారీ ప్రమాదం తప్పింది
అయితే, వేగంగా వెళుతున్న రైలు భగవాన్పూర్ రైల్వే స్టేషన్కు చేరుకున్నప్పటికీ సమస్యను గుర్తించే ప్రయత్నాలు జరగలేదని సమాచారం. రైలు భగవాన్పూర్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరగా.. ఆ శబ్ధంలో ఏ మార్పు రాకపోవడంతో ప్రయాణికులకు ఆనుమానం వచ్చి చైన్ లాగేసి రైలును ఆపేశారు. తక్షణమే ట్రైన్లో ఏదో సమస్య ఉందని రైల్వే ఉద్యోగులతో పాటు రైలు డ్రైవర్, గార్డులకు సమాచారం అందించారు.
దీంతో వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది జరిపిన తనిఖీలో, S-11 కోచ్ చక్రం విరిగిందని కనుగొన్నారు. దీని తర్వాత రైల్వే ఇంజనీర్లు, ఉద్యోగులు రైల్వే స్టేషన్కు చేరుకుని రైలుకు మరమ్మతులు చేయగా, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ‘పవన్ ఎక్స్ప్రెస్ చక్రం విరిగిపోయిందని మాకు సమాచారం అందింది. వెంటనే మా బృందం అక్కడికి చేరుకొని మరమ్మతులు నిర్వహించింది’ అని రైల్వే అధికారి వీరేంద్ర కుమార్ వెల్లడించారు. కాగా జూన్ 2న బాలాసోర్ రైలు ప్రమాదంలో 290 మందికి పైగా మరణించిన 1,000 మందికి పైగా గాయపడిన ఘటన మరవకముందే ఇది చోటు చేసుకోవడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment