ఉడ్‌తా కేరళ!  | Udta Kerala: Drug crisis hits schools, ravages homes | Sakshi
Sakshi News home page

ఉడ్‌తా కేరళ! 

Published Mon, Mar 10 2025 5:30 AM | Last Updated on Mon, Mar 10 2025 5:30 AM

Udta Kerala: Drug crisis hits schools, ravages homes

మత్తులో తూగుతున్న అందాల రాష్ట్రం 

విపరీతంగా పెరుగుతున్న డ్రగ్స్‌ వాడకం

పంజాబ్‌ దాటి దేశంలోనే అగ్ర స్థానానికి 

స్కూలు పిల్లల్లోనూ పెరుగుతున్న వ్యసనం

అందమైన అడవులు, కొండలు, లోయలతో దేవుడు తీరిగ్గా తీర్చిదిద్దినట్టుగా ఉండే కేరళ మాదకద్రవ్యాల మత్తులో కూరుకుపోతోంది. రాష్ట్రాన్ని డ్రగ్స్‌ భూతం కబళిస్తోంది. చివరికి స్కూలు విద్యార్థులు కూడా డ్రగ్స్‌కు బానిసలవుతున్న పరిస్థితి! మాదకద్రవ్యాల వాడకంలో పంజాబ్‌ను కూడా దాటేసి దేశంలో తొలి స్థానంలో నిలిచింది. కేరళలోని కడక్కవూర్‌లో ఓ మహిళ డ్రగ్స్‌ మత్తులో టీనేజీ వయసున్న కన్న కొడుకుపైనే లైంగిక దాడులకు పాల్పడింది. దాంతో సహించలేక మరో కొడుకు ఆమెను చంపేశాడు! సంచలనం రేపిన ఈ ఘటన రాష్ట్రంలో సింథటిక్‌ డ్రగ్స్‌ విజృంభణకు ఉదాహరణ మాత్రమే.

కేరళలో ఏ మూలన చూసినా డ్రగ్స్‌ ఘాటు గుప్పున కొడుతోందని నార్కోటిక్‌ గణాంకాలు చెబుతున్నాయి. 2024లో రాష్ట్రవ్యాప్తంగా నార్కోటిక్‌ డ్రగ్స్, సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ చట్టం,1985 కింద ఏకంగా 24,517 కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్‌ అతి వాడకానికి మారుపేరుగా మారిన పంజాబ్‌లో నమోదైంది 9,734 కేసులే! ‘‘సింథటిక్‌ డ్రగ్స్‌ రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా కఠిన చట్టాలు చేయాల్సిన సమయమొచి్చంది. స్కూళ్ల ప్రాంగణాల్లోనూ డ్రగ్స్‌ బయటపడుతున్నాయి’’ అని కేరళ హైకోర్టు జస్టిస్‌ వీజీ అరుణ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

330 శాతం అధికం 
2021 నుంచి చూస్తే మూడేళ్లలో కేరళలో డ్రగ్స్‌ కేసులు 330 శాతం పెరిగాయి. నమోదవని ఘటనలు మరెన్నో రెట్లు ఉంటాయని చెబుతున్నారు. రాష్ట్రంలో తరచూ భారీ పరిమాణంలో మత్తుపదార్థాలను పోలీసులు స్వా«దీనం చేసుకుంటున్నారు. గతంలో స్థానికంగా దొరికే గంజాయి సేవించేవారు. ఇప్పుడు సింథటిక్‌ డ్రగ్స్‌ వైపు మళ్లుతున్నారని స్వయంగా హైకోర్టు న్యాయమూర్తే వాపోయారు. దీనిపై అసెంబ్లీలో రెండుసార్లు చర్చించడమే గాక సమస్య పార్లమెంటులోనూ ప్రస్తావనకు వచ్చింది.  

ఎన్నెన్ని విషాదాలో...! 
డ్రగ్స్‌కు బానిసలైన వారి కుటుంబాల్లో ఆనందం ఆవిరవుతోంది. యువత, ముఖ్యంగా మైనర్లు మత్తులో తూగుతున్నారు..

→ కాలికట్‌ జిల్లాలో మత్తుకు బానిసైన పాతికేళ్ల ఆశిఖ్‌ తన తల్లినే నరికి చంపాడు. పైగా ‘నాకు జన్మనిచి్చనందుకు శిక్షించా’ అంటూ డ్రగ్స్‌ మత్తు లో చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మా రింది.

→ త్రిసూర్‌లో మరో పాతికేళ్ల వ్యక్తి తల్లి నాలుక కోసేశాడు. జనవరి 1న త్రిసూర్‌లోనే 14, 16 ఏళ్ల టీనేజర్లు బహిరంగంగా డ్రగ్స్‌ తీసుకుంటూ హల్‌చల్‌ చేశారు. వారించిన 30 ఏళ్ల వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు.

→ తమ అబ్బాయి డ్రగ్స్‌ వ్యసనాన్ని వదిలించలేకపోతున్నామంటూ పథినంతిట్ట జిల్లాలో ఒక వృద్ధ జంట ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ కంటతడి పెట్టించింది.

→ డ్రగ్స్‌ మానేయమన్న అక్క ముఖాన్ని బ్లేడుతో చెక్కేశాడో తమ్ముడు. మరో ప్రబుద్ధుడు మందలించిన తండ్రిపైనే దాడికి దిగాడు. ఇంకొకడు డ్రగ్స్‌ కొనేందుకు డబ్బివ్వలేదని తల్లినే చితకబాదాడు.

→ డ్రగ్స్‌ తీసుకుంటూ టీచర్లకు పట్టుబడి, విషయం ఇంట్లో చెప్పొద్దని వాళ్లనే బెదిరిస్తున్న విద్యార్థులకు కొదవే లేదు.  

డార్క్‌వెబ్, క్రిప్టోకరెన్సీలో లావాదేవీలు 
డ్రగ్స్‌ను ముఠాలు పోలీసులకు చిక్కకుండా అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నాయి. డార్క్‌వెబ్, క్రిప్టోకరెన్సీ, వాట్సాప్‌ గ్రూప్‌ల్లో లావాదేవీలు సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కేరళలో డ్రగ్‌ సరఫరా చేసే హాట్‌స్పాట్లు ఏకంగా 1,300కు పైగా ఉన్నట్లు చెబుతున్నారు. కొకైన్, హషి‹Ù, బ్రౌన్‌ షుగర్, హెరాయిన్‌ వాడకం ఎక్కువగానే ఉన్నా మిథేలిన్‌ డైఆక్సీ మిథాఫెటమైన్‌ (ఎండీఎంఏ) వీటన్నింటినీ మించిపోయింది. దీని వాడకం ఏడాదిలోనే ఏకంగా 65 శాతం పెరిగింది. ఎండీఎంఏ, మెథ్‌ వేరియంట్‌ డ్రగ్స్‌ బెంగళూరు, చెన్నై నుంచి కేరళలోకి వస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. 590 కిలోమీటర్ల సముద్రతీరం కూడా డ్రగ్స్‌ సరఫరాకు రాచమార్గంగా మారింది. జర్మనీ, ఫ్రాన్స్, థాయిలాండ్‌ దేశాల నుంచి డార్క్‌వెబ్‌ ద్వారా క్రిప్టో కరెన్సీని విక్రయించి బదులుగా కొరియర్ల ద్వారా డ్రగ్స్‌ తెప్పిస్తున్నారు.

నాలుగేళ్లలో 93,599 అరెస్టులు! 
కేరళలో 2023లో ఏకంగా 30,697, 2024లో 24,517 డ్రగ్స్‌ కేసులు నమోదయ్యాయి. గత నాలుగేళ్లలో 87,101 కేసులు నమోదయ్యాయి. వీటిలో 93,599 మందిని అరెస్టు చేశారు. అంతకుముందు నాలుగేళ్లలో 37,228 కేసులు నమోదవగా 41,378 మందిని అరెస్టు చేసినట్టు సీఎం విజయన్‌ అసెంబ్లీలో చెప్పారు. గత జనవరిలో 2,000 డ్రగ్స్‌ కేసులు నమోదయ్యాయి.


క్యాండీలు, ఐస్‌క్రీంల రూపంలో... 
సింథటిక్‌ డ్రగ్స్‌ వాడేవారిలో సమాజంలోని అన్నివర్గాల వారూ ఉన్నారు. విద్యార్థుల నుంచి వైద్యుల దాకా వాటికి బానిసలవుతున్నారు. ఎవరూ గుర్తు పట్టకుండా చాక్లెట్ల నుంచి ఐస్‌క్రీంల దాకా నానారకాలుగా వీటిని విక్రయిస్తున్నారు. పైగా వీటికి విద్యాసంస్థలే అడ్డాలుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దాంతో తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. తమ పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారేమో తేల్చుకోవడానికి టెస్ట్‌ కిట్లు కొనుగోలు చేస్తున్నారు. దాంతో వాటి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.

సూపర్‌బైక్‌లపై డెలివరీ... 
స్మార్ట్‌ ఫోన్‌లో, వాట్సాప్‌ గ్రూప్‌లోనూ మెసేజ్‌ చేస్తే పావుగంటలోపే సూపర్‌ బైక్‌లపై వచ్చి మరీ డ్రగ్స్‌ డెలివరీ చేసే స్థాయికి కేరళ ఎదిగిందని అసెంబ్లీలో విపక్ష నేత ఇటీవలే ఎద్దేవా చేశారు. పెడ్లర్లు డ్రగ్స్‌ సరఫరాకు తప్పుడు/నకిలీ నంబర్‌ ప్లేట్లున్న సూపర్‌బైక్‌లను వాడుతున్నారు. పోలీసులకు చిక్కకుండా వాటిపై మెరుపు వేగంతో దూసుకెళ్తున్నారు. తోటి పెడ్లర్ల పోటీని తట్టుకునేందుకు, వేగంగా సరకు డెలివరీకి రాత్రిళ్లు ఈ బైక్‌లను వాడుతున్నట్టు ఎక్సయిజ్, పోలీసు విభాగాలు చెబుతున్నాయి. డ్రగ్స్‌ ముఠాలు 18–24 ఏళ్ల వారినే డెలీవరీకి ఎంచుకుంటున్నారు. ఒక ప్యాకెట్‌కు రూ.1,000, రోజంతా డెలీవరీ చేస్తే రూ.4,000 ఇస్తున్నారు. ఫ్యామిలీ అని భ్రమింపజేసేలా బైక్‌ వెనక మహిళను కూర్చోబెట్టుకుంటున్నారు.  


టీనేజర్లనే డ్రగ్స్‌ పెడ్లర్లుగా ఈ ముఠాలు వాడుకుంటున్నాయి. పోకిరీలతో పరిచయాలు కాకుండా తల్లిదండ్రులే తమ పిల్లలపై కన్నేసి ఉంచాలి
– రిటైర్డ్‌ ఎస్పీ కేజీ సిమాన్‌  

కేరళలో పదేళ్ల విద్యార్థులు కూడా గ్యాంగ్‌ ఫైట్లకు దిగుతున్నారు. కనీసం 10 నుంచి 15 క్రిమినల్‌ కేసులున్న విద్యార్థి నాయకులను ఆదర్శంగా తీసుకుంటున్నారు
– కేరళ కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌

‘‘అత్యధిక అక్షరాస్యతా రేటు, ఉన్నత విద్యార్హతలున్నా ఉపాధి లేక కేరళలో యువత నైరాశ్యంతో డ్రగ్స్‌ బారిన పడుతోంది’’ 
– ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) ఆసియా–పసిఫిక్‌ రీజియన్‌ మాజీ సలహాదారు జి.ప్రమోద్‌కుమార్‌

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement