
భోపాల్: కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ రాజ్యసభ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా జార్జ్ కురియన్ను భోపాల్లో నామినేషన్ వేశారు. జ్యోతిరాదిత్య సింధియా లోక్సభకు ఎన్నికవ్వడంతో.. ఖాళీ అయిన మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి కురియన్ను తమ అభ్యర్థిగా బీజేపీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది.
ప్రస్తుతం జార్జ్ కురియన్ మోదీ 3.0 కేబినెట్లో ఫిషరీస్, పశుసంవర్ధక పాడి పరిశ్రమ, మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.
బుధవారం ఉదయం భోపాల్ చేరుకున్న కురియన్కు అక్కడ రాష్ట్ర బీజేపీ చీఫ్ వీడీ శర్మ ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి మోహన్యాదవ్ను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీ కాంప్లెక్స్లో సీఎం యాదవ్, ఉప ముఖ్యమంత్రులు రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవదా, రాష్ట్ర బీజేపీ చీఫ్ శర్మ సమక్షంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారని పార్టీ అధికార ప్రతినిధి ఆశిష్ అగర్వాల్ తెలిపారు.
ఇక పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. సెప్టెంబర్ 3వ తేదీన జరగనున్న ఈ ఎన్నికలకు కేంద్రమంత్రులు రణ్వీత్సింగ్ బిట్టూ (రాజస్థాన్ నుంచి), జార్జి కురియన్ (మధ్యప్రదేశ్ నుంచి)ను అభ్యర్థులగా బరిలో దించింది. బిజూ జనతాదళ్ మాజీ నేత మమత మొహంతను ఒడిశా నుంచి తమ అభ్యర్థిగా ప్రకటించిన కమలం పార్టీ.. బార్ కౌన్సిల్ ఛైర్మన్, సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రాను బిహార్ నుంచి పోటీకి దించింది.
సార్వత్రిక ఎన్నికల్లో బరిలో దిగిన నేపథ్యంలో పలువురు సభ్యులు రాజీనామాలు చేయడం, అలాగే, తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు, ఒడిశాలో బిజేడీ ఎంపీ మమతా మొహంత తమ పదవులకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment