భారత్, చైనా మధ్య ‘యుద్ధాటకం’ | war situation between china and india | Sakshi

భారత్, చైనా మధ్య ‘యుద్ధాటకం’

Sep 10 2020 4:27 PM | Updated on Sep 10 2020 6:43 PM

war situation between china and india - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దాదాపు నాలుగు దశాబ్దాల అనంతరం, అంటే 1975 సంవత్సరం తర్వాత భారత్, చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వద్ద మొట్టమొదటి సారి కాల్పుల కలకలం చెలరేగింది. సెప్టెంబర్‌ ఏడవ తేదీన భారత వాస్తవాధీన పరిధిలోకి చొచ్చుకు వస్తోన్న చైనా సైనికులను భారత సైనికులు అడ్డగించినందుకు చైనా సైనికులు గాలిలోకి కాల్పులు జరిపారని భారత మీడియా పేర్కొనగా, భారత సైనికులే కాల్పులు జరిపారని చైనా మీడియా ఆరోపించింది. గత మే నెల నుంచి ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు చైనా సైనికులు సష్టించిన హింసాకాండలో 20 మంది భారత సైనికులు మరణించడంతో ఒక్కసారిగా తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఆ పరిస్థితి చివరకు చైనా వస్తువుల బహిష్కరణ, చైనా యాప్‌లపై నిషేధం దాకా కొనసాగింది. (దక్షిణాన సైనికులు.. ఉత్తరాన నిర్మాణాలు)

ఈలోగా సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితుల పునరుద్ధరణ కోసం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్య చర్యలు ఫలితాలిస్తున్నట్లుగానే కనిపించాయి. ఇంతలో కాల్పుల కలకలం చెలరేగడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తారా స్థాయికి చేరుకున్నాయి. మాస్కోలో జరుగుతోన్న ‘శాంఘై కోపరేషన్‌ ఆర్గనైజేషన్‌’ సమ్మేళనంలో పాల్గొనేందుకు మాస్కో నగరానికి వెళ్లిన భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జై శంకర్‌ అక్కడ ఈ రోజు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో ముఖాముఖి సమావేశమై శాంతి కోసం చర్చలు జరపనున్నారు.(ముదురుతున్న వివాదం)

‘సరిహద్దుల్లో కొంచెం మేఘాలు కమ్ముకున్నాయి’ అని జై శంకర్‌ మాస్కో వెళ్లే ముందు భారత మీడియాతో వ్యాఖ్యానించారు. వారం రోజుల క్రితమే కేంద్ర ర క్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, చైనా రక్షణ మంత్రిని కలుసుకొని చర్చలు సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చలు జరిపారు. అయినప్పటికీ కాల్పుల కల్లోలం చెలరేగడంతో విదేశాంగ మంత్రులు దౌత్యపరమైన చర్చలను చేపట్టాల్సి వచ్చింది. చైనాతో వ్యాపార సంబంధాల పునరుద్ధరణ, చైనా ఆప్‌లపై నిషేధం ఎత్తివేత అంశాలను చైనా ప్రస్తావిస్తే అందుకు స్పందిస్తారా ? అని భారత మీడియా ప్రశ్నించగా, లేదని, తాను చర్చల్లో కేవలం సరిహద్దు ఉద్రిక్తతలకే పరిమితం అవుతానని ఆయన సమాధానం చెప్పారు.

ఇరుదేశాల మధ్య యుద్ధ మేఘాలు దట్టమవుతున్నాయని, విదేశాంగ మంత్రుల చర్చలు విఫలమైతే ఇరు దేశాల మధ్య పరిమిత యుద్ధమైన జరుగుతుందని జాతీయ మీడియాలో మెజారిటీ అభిప్రాయపడుతోంది. అమెరికాతో అంటకాగుతున్న భారత్‌ను తనవైపు తిప్పుకునేందుకు, ముఖ్యంగా చైనా ఉత్పత్తుల దిగుమతి పునరుద్ధరణ కోసం సరిహద్దు ఉద్రిక్తతలకు చైనా పాల్పడుతోందని మీడియాలో ఓ వర్గం భావిస్తుండగా, అణ్వస్త్రాలు కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశమే లేదని, తమ తమ దేశాల్లో కరోనా వైరస్‌ మహమ్మారి సష్టిస్తోన్న కల్లోల పరిస్థితుల నుంచి ప్రజల దష్టిని మళ్లించేందుకు భారత్, చైనాలు కూడబల్కోని ఆడుతున్న ‘యుద్ధ నాటకం’ అని మీడియాలో మరో వర్గం అనుమానిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement