
గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
జక్రాన్పల్లి: జక్రాన్పల్లి పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న రాంచందర్ (50) గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. నిజామాబాద్లో నివాసం ఉంటున్న రాంచందర్ నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్కు గురికాగా చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కాగా చికి త్స పొందుతున్న రాంచందర్కు శనివారం గుండెపోటు రావడంతో మరణించాడు. మూడేళ్లుగా జక్రాన్పల్లి పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. రాంచందర్ స్వస్థలం కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్ తండా. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. రాంచందర్ మృతి పట్ల జక్రాన్పల్లి ఎస్సై తిరుపతి, ఏఎస్సైలు వెంకట్కుమార్, సుశీల్కుమార్, సిబ్బంది వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.
బాలికకు చిత్రహింసలు
● తండ్రి, సవతి తల్లిపై కేసు నమోదు
ఖలీల్వాడి: రెండో భార్యతో కలిసి కన్న కూతురిని చిత్రహింసలకు గురిచేసిన ఘటన నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ కేసులో తండ్రితోపాటు సవతి తల్లిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గంగాధర్ శనివారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. నాగారం గోశాలకు చెందిన షేక్ హుస్సేన్ మొదటి భార్య అహ్మదీ బేగం నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. వీరికి ఒక కుమార్తె(13) ఉంది. రిజ్వానా బేగంను హుస్సేన్ రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. రెండో వివాహం అయినప్పటి నుంచి బాలికను బడి మాన్పించి, ఇంటి పనులు చేయిస్తూ నరకం చూపిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 5 గంటలకే నిద్రలేపి ఇంటి పని చేయించేవారు. పాచిపోయిన అన్నం పెడుతూ కొట్టేవారు. బంధువుల ఇంటికి కూడా వెళ్లనిచ్చేవారు కాదు. ఈ నెల 8న హుస్సేన్, రిజ్వానా బేగంలు బాలికను భైంసాలోని వరసకు అత్తమ్మ అయిన వజీర్బీ ఇంటి ఎదుట వదిలేసి వెళ్లిపోయారు. దీంతో వజీర్బీ ప్రస్తుతం ఆ బాలికను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. బాలిక మామ షేక్ హయాత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగాధర్ వెల్లడించారు.