
ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకుడి అరెస్ట్
ఖలీల్వాడి: నగరంలోని ఆరో టౌన్ పరిధి లతీఫ్ కాలనీకి చెందిన ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకుడు షేక్ ఆసిఫ్ అలీని పోలీసులు పట్టుకున్నారు. సీఐ సురేశ్కుమార్ శనివారం వివరాలు వెల్లడించారు. అర్సపల్లి బైపాస్ రోడ్డులోని ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద ఆసిఫ్ అలీని పట్టుకోగా, అప్పటికే నిందితుడు ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా, కొంత మంది యువకులకు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపి వారితో క్రికెట్ బెట్టింగ్ ఆడించేవాడినని ఒప్పుకున్నట్లు తెలిపారు. ఆసిఫ్ అలీపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. సీఐ వెంట ఎస్సై వెంకట్రావు, సిబ్బంది ఉన్నారు.
కార్లను ఢీ కొట్టిన ఆటో డ్రైవర్
భిక్కనూరు: మద్యం మత్తులో ఇంటి ముందు నిలిపిన కార్లను శనివారం ఓ ఆటో డ్రైవర్ ఢీ కొట్టినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. భిక్కనూరులో జరుగుతున్న పెద్దమ్మ ఉత్సవాలకు గ్రామానికి చెందిన పున్న లక్ష్మీనారాయణ బంధువులు వచ్చారు. వారికి చెందిన రెండు కార్లను ఇంటి ఎదుట నిలిపి ఉంచగా, మండల కేంద్రానికి చెందిన బాబు అనే ఆటో డ్రైవర్ మద్యం సేవించి అజాగ్రత్తగా ఆటో నడిపి కార్లను ఢీకొట్టాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
ఒకరిపై ఇసుక మాఫియా దాడి
రెంజల్(బోధన్): మండలంలోని పేపర్మిల్ గ్రామంలో ఇసుక మా ఫియా ఓ వ్యక్తిని తీవ్రంగా చితకబాదింది. ఈ నెల 3న నిజామాబాద్ రూ రల్ పోలీసులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెంజల్ మండలానికి చెందిన మూడు టిప్పర్లను పట్టుకున్నారు. టిప్పర్లు పట్టుబడేందుకు గ్రామానికి చెందిన వ్యక్తి కారణమని అనుమానించిన మాఫియా శనివారం అతన్ని పట్టుకొని దాడిచేశారని గ్రామస్తుల ద్వారా తెలిసింది. కొందరు పోలీసులు ఉప్పందించడంతో దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ విషయమై ఎస్సై చంద్రమోహన్ను వివరణగా కోరగా పరస్పరం దాడి చేసుకొని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈత వనం దగ్ధం
మోర్తాడ్: ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్లో శనివారం ఈత వనం దగ్ధమైంది. గౌడ సంఘం ఆధ్వర్యంలో వారి సొంత భూమిలో ఈత చెట్లను పెంచుతున్నారు. కాపలా ఉన్న వ్యక్తి భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లగా తిరిగి వచ్చేంతలోపే ఈత వనానికి నిప్పంటుకుంది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఈత వనంలో దాదాపు 100 చెట్లు కాలిపోయాయి. చెట్లు కాలిపోవడంతో తమ ఉపాధిపై దెబ్బ పడిందని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి కమిటీతో వివాదం కొనసాగుతున్న ఈ తరుణంలో ఈతవనం దగ్ధంపై అనేక సందేహాలు నెలకొన్నాయి. గీత కార్మికుల ఫిర్యాదు మేరకు భీమ్గల్ సీఐ సత్యనారాయణ, ఏర్గట్ల ఎస్సై రాము, ఎకై ్సజ్ సీఐ గుండప్ప, ఎస్సై మానస ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకుడి అరెస్ట్