
పొగాకు రైతుల్లో టెన్షన్
రెంజల్(బోధన్): పొగాకు బీట్లు ప్రారంభించకపోవడంతో రైతులు టెన్షన్ పడుతున్నారు. ఓ పక్క అ కాల వర్షాల భయం వెంటాడుతుండగా, మరోపక్క అధిక వేడితో తేమ వచ్చి పొగాకు బూజు పడుతున్న ట్లు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ర్చి నెలలోనే ప్రారంభించాల్సిన బీట్లు ఆలస్యం కా వడంతో ఆర్థికంగా అదనపు భారం పడుతుందంటున్నారు. బీట్లు ఎప్పుడెప్పుడా అని కంపెనీ ప్ర తినిధుల రాక కోసం రైతులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
మహారాష్ట్రలో తక్కువ ధరకు కొనుగోళ్లు
సరిహద్దున గల మహారాష్ట్రలో రైతుల నుంచి పొగాకు కొనుగోళ్లను ఆయా కంపనీలు ప్రారంభించగా, తెలంగాణలో ఎందుకు జాప్యం చేస్తున్నారో ఇక్కడి రైతులకు అంతుచిక్కడంలేదు. ధరలో వ్యత్యాసం ఉండటంతో ముందుగా అక్కడ కొనుగోళ్లు చేపడుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర కమీషన్ ఏజెంట్ల ద్వార కొనుగోళ్లు చేపడుతూ ఇక్కడి రైతులను ఉద్దేశ్య పూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. గత సంవత్సరం వీఎస్టీతో సహా పలు కంపెనీలు క్వింటా పొగాకుకు రూ.13,500 చెల్లించాయని రైతులు పేర్కొంటున్నారు. కానీ ఈ సీజన్లో కమీషన్ ఏజెంట్ల ద్వార మహారాష్ట్రలో క్వింటా పొగాకును రూ. 9వేల నుంచి రూ.11వేల వరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
సుమారు 12వేల ఎకరాల్లో సాగు..
ఉమ్మడి జిల్లాలోని బోధన్, బాన్సువాడ డివిజన్లలోనే పొగాకును అత్యధికంగా రైతులు సాగు చేస్తారు. సుమారు ప్రతి సంవత్సరం 10నుంచి 12వేల ఎకరాల్లో పంట సాగవుతుంది. గత 50 సంవత్సరాలుగా ఇక్కడి రైతులు వీఎస్టీ(వజీర్ సుల్తాన్ట్యూబాకో) కంపెనీతో ముందస్తు ఒప్పందం చేసుకుని పంట సాగు చేస్తారు. ఇటీవల వీఎస్టీతో పాటు పీటీపీ, ఐటీసీ, కేఆర్కే కంపెనీలు ముందుకు వచ్చి పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయి. కంపెనీ ప్రతినిధులు ముందుగా రైతులతో బాండ్లు (ఓప్పంద పత్రం) రాయించుకుని పర్యవేక్షణ చేస్తారు. కానీ రెండు సంవత్సరాలుగా ఒప్పందం లేకుండానే వీఎస్టీపై ఆధారపడి నమ్మకంతో రైతులు పంటను సాగు చేస్తున్నారు. గత సంవత్సరం పొగాకుకు మార్కెట్లో డిమాండ్ ఉండటంతో కంపెనీలు మంచి ధర చెల్లించాయి. ఈయేడు అదే ధర చెల్లిస్తారని రైతులు ఆశించి అధికంగా సాగు చేశారు. ప్రతీ సంవత్సరం కంపెనీలు రూ.200 నుంచి 5 వందల వరకు ధరను పెంచుతూ వస్తున్నాయి. ఇప్పటికై నా ఆయా కంపెనీలు త్వరగా బీట్లు ప్రారంభించాలని అన్నదాతలు కోరుతున్నారు.
బీట్ల ప్రారంభంలో కంపెనీల జాప్యం
వాతావరణ పరిస్థితులతో ఆందోళన
వెంటనే బీట్లు ప్రారంభించాలి
16 ఎకరాల్లో పొగాకు పండించాను. యేటా పంట పెట్టుబడులు పెరుగుతున్నాయి. వీఎస్టీ కంపెనీ ప్రకటించిన ధరనే మిగిలిన కంపెనీలు అనుసరిస్తాయి. ఎప్పుడైనా మార్చిలో కొనుగోలు చేసి, ఏప్రిల్లో బిల్లులు చెల్లించేవారు. ప్రస్తుతం బీట్ల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. కంపెనీలు స్పందించి బీట్లను ప్రారంభించాలి.
–దేవేందర్, రైతు, కందకుర్తి
నిర్లక్ష్యం చేస్తున్నారు
పొగాకు కంపెనీలు కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నాయి. కమీషన్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని మహారాష్ట్రలో కొనుగోలు చేప ట్టి అక్కడి రైతులను నిలువు నా ముంచుతున్నారు. జిల్లా అధికారును కలిసి ఫిర్యాదు చేస్తాం, మహారాష్ట్ర నుంచి పొగాకు లారీలు తెలంగాణ మీదుగా ఆంధ్ర కు తరలిస్తున్నారు. సరిహద్దుల్లో పొగాకు లారీలను అధికారులు నియంత్రించాలి. అప్పడే కంపెనీలు ముందుకు వస్తాయి. –సిరాజ్బేగ్, రైతు, కందకుర్తి

పొగాకు రైతుల్లో టెన్షన్

పొగాకు రైతుల్లో టెన్షన్

పొగాకు రైతుల్లో టెన్షన్