
నిధుల్లేక.. పనులు సాగలేక..
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన ఉన్న జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో ప్రస్తుతం చేపపిల్లల ఉత్పత్తి కోసం పనులను ప్రారంభించారు. కానీ నిధులు లేక పనులు ముందుకుసాగడం లేదు. ప్రాజెక్ట్ దిగువన 42 ఎకరాల విస్తీర్ణంతో 250 సిమెంట్ కుండీలతో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఉంది. కానీ పని చేసే సిబ్బంది మాత్రం ఏడుగురు మాత్రమే ఉన్నారు. చేప పిల్లల కేంద్రంలో ప్రతి సంవత్సరం చేప పిల్లల ఉత్పత్తి చేయుటకు రూ.8లక్షల నిధులు అవసరమవుతాయి. కానీ ప్రభుత్వం నుంచి చిల్లి గవ్వ కూడ రావడం లేదు. గతేడాది కేవలం చివరి నిమిషంలో లక్ష రూపాయాలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో చేప పిల్లల ఉత్పత్తి మధ్యలోనే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.
2 టన్నుల తల్లి చేపలు అవసరం..
ప్రస్తుతం చేపపిల్లల ఉత్పత్తి కోసం అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. చేప పిల్లల ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభం కోసం ముందుగా చెరువుల నుంచి తల్లి చేపలను దిగుమతి చేసుకుంటారు. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి 2టన్నుల తల్లి చేపలు అవసరం ఉంటుంది. కిలోకు 100 రూపాయాల చొప్పున మత్స్యకారుల నుంచి కొనుగోలు చేయాలి. అ లెక్కన రెండు టన్నులకు 2లక్షల రూపాయాలు, రవాణా ఖర్చులు 50వేలు అవుతుంది. కానీ ప్రభుత్వం ఇప్పటికీ చిల్లి గవ్వ కూడ ఇవ్వ లేదు. దీంతో తల్లి చేపలను ఎలా కొనుగోలు చేయాలని మత్స్యశాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేప పిల్లల కేంద్రానికి దగ్గరలో ఉన్న చెరువుల్లో ప్రస్తుతం నీరు నిండుగా ఉంది. తల్లిచేపలను వలలతో వేటాడితే ఎక్కువ నీరున్నా చెరువుల్లో చిక్కవు. దీంతో బోధన్, నవీపేట్ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. మే 2వ వారం నుంచి తల్లి చేపలను తీసుకురావాల్సి ఉంటుంది. గతంలో పని చేసిన ఎఫ్డీవోలు జేబులోనుంచి ఖర్చు చేసి ఇప్పటికీ డబ్బులు రాకా నానా అవస్థలు పడుతున్నారు. అందుకే చేప పిల్లల కేంద్రంలో పని చేయాలంటే అధికారులు జంకుతున్నారు. ఇప్పటికై నా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నిధులు మంజూరు చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.
జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో ఇబ్బందులు
తల్లి చేపల కోసం పైసలు కరువు
నిధులు రావడం లేదు..
పోచంపాడ్లోని జాతీయ చేపపిల్లల కేంద్రానికి నిధులు రావడం లేదు. ప్రభుత్వానికి పలుమార్లు నివేదించాం. ఇక్కడ పని చేసే అఽధికారులతోపాటు జిల్లాస్థాయి అధికారులు కూడ జేబులో నుంచి డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది.
–ఆంజనేయ స్వామి, ఏడీ, మత్స్యశాఖ, నిజామబాద్

నిధుల్లేక.. పనులు సాగలేక..