దోహాలో తొమ్మిదొవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు | 9th World Telugu Literature Conference In Doha | Sakshi
Sakshi News home page

దోహాలో తొమ్మిదొవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

Nov 18 2024 3:11 PM | Updated on Nov 18 2024 5:21 PM

9th World Telugu Literature Conference In Doha

ఈ నెల నవంబర్ 22,23, 2024 తేదీలలో మధ్య ప్రాచ్య దేశాలలో తొలిసారిగా ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు భారత మాజీ ఉప రాష్ట్రపతి “పద్మవిభూషణ్” ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కుటుంబ సమేతంగా ప్రధాన అతిధిగా విచ్చేస్తున్నారు. ఈ వేడుకలో స్థానిక చిన్నారుల స్వాగత నృత్యం, ఉపాధ్యాయుల సత్కారంతో సదస్సు ప్రారంభం అవుతుంది. ఖతార్ దేశంలో భారత రాయబారి ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారు.

పది మధ్య ప్రాచ్య దేశాల అధ్యక్షులు, భారతదేశం, అమెరికా, ఆఫ్రికా మొదలైన అనేక ప్రాంతాల నుంచి సుమారు 75 మంది వక్తలు, 250 మంది సాహిత్య ప్రతినిధులు, తెలుగు రాష్త్రాల మంత్రి వర్యులు, సినీ గేయ రచయితలు, కవులు, పండితులు నమోదు చేసుకుని ప్రయాణానికి సంసిధ్దంగా ఉన్నారు. సదస్సు తర్వాత దోహా మహానగర సందర్శనం ఏర్పాట్లు కూడా ఉన్నాయి. 

ఈ సదస్సులో ప్రముఖ కథకులు, సాహితీ వేత్త ప్రొ. రామా చంద్రమౌళి (వరంగల్) గారెకి ప్రతిష్టాత్మకమైన జీవన సాఫల్య పురస్కార ప్రదానం జరుగుతుంది. ఈ సదస్సులో విభిన్న అంశాల మీద నిష్ణాతుల సాహిత్య ప్రసంగాలు, సినీ కవి మౌనశ్రీ మల్లిక్ మొదలైన సుమారు 35 మంది ప్రముఖ కవుల స్వీయ రచనా పఠనం, ఆ ప్రాంతంలో ఆచార్య అద్దంకి శ్రీనివాస్ గారు సంచాలకులుగా శ్రీమతి బులుసు అపర్ణ గారి తొలి మహిళా అష్టావధానం, కవి జొన్నవిత్తుల గారి శతక గ్రంధావిష్కరణతో సహా 33 నూతన గ్రంధాల ఆవిష్కరణ, కొత్తగా రూపొందించబడిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి సమగ్ర వెబ్ సైట్ ఆవిష్కరణ మొదలైన అంశాలతో పాటు పుస్తక ప్రదర్శన-విక్రయశాల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

మొదటి రోజు..అనగా నవంబర్ 22, 2024 నాడు సాయంత్రం ప్రత్యేక ఆహ్వానితుల గౌరవార్ధం విందు భోజనం, ప్రముఖ గాయనీ గాయకులు Y.S రామకృష్ణ, లలిత దంపతులు (హైదరాబాద్),  సుచిత్ర బాలాంత్రపు (సుచిత్ర ఆర్ట్ క్రియేషన్స్, కాకినాడ), రాంప్రసాద్ (విశాఖ) వారి సంగీత విభావరి, స్థానిక దోహా కళాకారుల సంగీత, నృత్య ప్రదర్శనలు మొదలైన ఆసక్తికరమైన అంశాలతో వినోద కార్యక్రమం జరుగుతుంది.

ప్రతిష్టాత్మకమైన ఈ 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కేవలం ఖర్చుల నిమిత్తం వదాన్యుల ఆర్థిక సహకారం అర్థిస్తున్నాం. వివరాలు జత పరిచిన ప్రకటనలో చూసి స్పందించమని కోరుతున్నారు నిర్వాహకులు. ఈ సదస్సు ప్రత్యక్ష ప్రసారం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి యూ ట్యూబ్ లింక్ లో చూడవచ్చు.  ఈ కార్యక్రమం ప్రధాన నిర్వాహకులు వంగూరి చిట్టెన్ రాజు, భాగవతుల వెంకప్ప, విక్రమ్ సుఖవాసి, రాధిక మంగిపూడి, శాయి రాచకొండ, వంశీ రామరాజు తదితరులు.
 

(చదవండి: డల్లాస్‌లో నాట్స్ ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement