కార్పొరేట్ శక్తులకు భూముల ధారాదత్తం
కృష్ణలంక(విజయవాడతూర్పు): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ భూములను అప్పగించడమే వికసిత్ భారత్ అని అఖిల భారత రైతుకులీ సంఘం(ఏఐకేఎంఎస్) జాతీయ అధ్యక్షుడు పి.టాన్యా విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు టి.ప్రకాష్ అధ్యక్షతన శుక్రవారం భూ సమస్యలపై రాష్ట్ర సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న టాన్యా మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు విధానాల ఫలితంగా, పాలకుల సంస్కరణల కారణంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోందని దుయ్యబట్టారు. అటవీ సంరక్షణ నియమాల పేరుతో, ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను అడవుల నుంచి గెంటివేసే కుట్ర జరుగుతోందని, అమాయక ఆదివాసీలను కాల్చి చంపుతుందని విమర్శించారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నల్లమడ రైతు సంఘం నాయకుడు కొల్లా రాజ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రిలయన్స్ కంపెనీకి ఐదు లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఎలా కట్టబెడుతుందని ప్రశ్నించారు. సదస్సులో ఏఐకేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.భాస్కర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యూ.గనిరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సత్యన్న, కె.దూలయ్య, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ఎం.రామకృష్ణ పాల్గొన్నారు.
ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు టాన్యా
Comments
Please login to add a commentAdd a comment