
చేరువైన విజయం
శ్రమ ఫలం..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన విద్యా సంస్కరణల ఫలితంగా ఓ మట్టిలో మాణిక్యం మెరిసింది. పేదలకు ఇంటర్మీడియెట్ విద్యను చేరువ చేసేందుకు తీసుకొచ్చిన హైస్కూల్ ప్లస్ కాన్సెప్ట్తో ఓ పేద విద్యార్థిని కార్పొరేట్ స్థాయి మార్కులు సాధించి సత్తా చాటింది. ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేని స్థితిలో.. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవించే కుటుంబంలో నుంచి వచ్చిన హరిణి అనే విద్యార్థిని స్టేట్లో ఉన్న హైస్కూల్ ప్లస్లలో ప్రథమస్థానం సాధించి ఔరా అనిపించింది.
జి.కొండూరు: ‘మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును మాత్రం మన దగ్గర నుంచి ఎవరూ తీసుకోలేరు చిన్నప్పా’ ఇది ఇటీవల వచ్చిన ఓ సినిమాలోని డైలాగ్. ఇదే సిద్ధాంతంతో బడుగు, బలహీన వర్గాలు, నిరుపేదల్లో అక్షరాస్యత పెంచి విద్యా వంతులను చేస్తే ఉన్నత స్థానాలకు చేరుకొని సమాజంలో గౌరవంగా బతుకుతారనే సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఈ సంస్కరణలలో భాగంగానే పేద విద్యార్థులు పదో తరగతి అనంతరం చదువు ఆపకూడదనే లక్ష్యంతో ఇంటర్ విద్యను చేరువ చేసేందుకు ప్రతి మండలానికి ఇంటర్ కళాశాల కాన్సెప్ట్ను తీసుకొచ్చారు. 2022–23 విద్యా సంవత్సరానికి గానూ హైస్కూలు ప్లస్లను ప్రవేశపెట్టారు. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది. ఇటీవల వచ్చిన ఇంటర్ ఫలితాల్లో మైలవరం ఎంబీఎం గరల్స్ హైస్కూలు ప్లస్లో చదివిన భూక్యా హరిణి అనే విద్యార్థిని స్టేట్లో ఉన్న హైస్కూల్ ప్లస్లలో ప్రథమస్థానం సాధించి ప్రైవేటు కళాశాలలకు సైతం సవాలు విసిరింది. ఆది నుంచి తెలుగు మీడియం చదివిన హరిణి ఇంటర్లో ఇంగ్లిష్ మీడియంలో చేరి అసాధారణ ఫలితాలను సాధించి అబ్బుర పరిచింది.
నిరుపేద కుటుంబం నుంచి..
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండల పరిధి వెదురుబీడెం గ్రామానికి చెందిన భూక్యా హరిణి తండ్రి గోపి రోజువారీ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోసిస్తున్నాడు. ఉండడానికి ఇల్లు కూడా లేకపోవడంతో గ్రామ శివారులోని మామిడితోటలోని రేకులషెడ్డులో నివాసం ఉంటున్నారు. హరిణి తల్లి దేవి అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉంటారు. హరిణికి తమ్ముడు పూర్వా దుర్గాప్రసాద్ ఉన్నాడు. ఇతను ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. నిరుపేద కుటుంబం కావడంతో హరిణి చదువంతా ప్రభుత్వ పాఠశాలలోనే కొనసాగింది. సొంత గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదివి, మైలవరం ఎంబీఎం గరల్స్ హైస్కూల్లో తొమ్మిది, పది తరగతులను పూర్తి చేసింది. పదో తరగతిలో 498 మార్కులు సాధించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రైవేటు కళాశాలలో చదివే స్తోమత లేక ఇదే పాఠశాలలో 2023–24 విద్యా సంవత్సరంలో ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్ చేరింది. ఇటీవల వచ్చిన ఫలితాల్లో 978మార్కులతో రాష్ట్రంలో ఉన్న 294హైస్కూల్ ప్లస్లలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇదే పాఠశాల నుంచి ఇంటర్ బైపీసీలో 976 మార్కులతో పటాన్ సాజిదా కాతూన్ అనే విద్యార్థిని రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచింది.
ఇంటర్ ఫలితాల్లో హైస్కూల్ ప్లస్ విద్యార్థిని సత్తా
మాజీ సీఎం జగన్ తీసుకొచ్చిన విద్యా సంస్కరణల ఫలితం ఇంటర్ విద్య కోసం గత ప్రభుత్వంలో హైస్కూల్ ప్లస్లు ఏర్పాటు మట్టిలో మాణిక్యాలకు వరంలా మారిన కాన్సెప్ట్ ప్రోత్సాహమిస్తే వైద్య విద్య చదువుతానంటున్న హరిణి
హైస్కూల్ ప్లస్ అభివృద్ధి ఇలా..
రాష్ట్రంలో ఉన్న హైస్కూల్ ప్లస్లలో ఇంటర్ ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన మైలవరం ఎంబీఎం గరల్స్ హైస్కూల్ ప్లస్కు గత ప్రభుత్వ హయాంలో రూ.229.30లక్షలను కేటాయించి అదనపు గదులను నిర్మించారు. వీటితో పాటు నాడు–నేడు కింద ఆధునిక వసతులను కల్పించారు. పాఠశాల తరగతులకే సరిపడా గదులు లేని ఈ పాఠశాలను ఇంటర్ విద్యకు సైతం సరిపడా గదులు నిర్మించడంతో పాటు కళాశాల వాతావరణం ఉట్టిపడేలా తీర్చి దిద్దారు.

చేరువైన విజయం

చేరువైన విజయం