టీడీపీ అరాచకాలపై విచారణ చేపట్టాలి
నరసరావుపేట: మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ తిరునాళ్లలో వైఎస్సార్ సీపీ వారిపై తెలుగుదేశం పార్టీ దమనకాండపై విచారణ చేసి, నిందితులను అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నడూ లేనివిధంగా అరాచక సంప్రదాయాలకు టీడీపీ తెరతీసిందని చెప్పారు. తిరునాళ్లలో ఎన్నో ఏళ్లుగా ఏ పార్టీకి చెందిన వారైనా ప్రభలు కట్టుకోవచ్చునని, ఎవరికి ఇష్టమైన పాటలు వాళ్లు వేసుకోవచ్చునని గుర్తు చేశారు. ఈ తిరునాళ్లలో గోనెపూడి గ్రామానికి వైఎస్సార్ సీపీ ప్రభ వద్దకు ఆ పార్టీకి చెందిన సానుభూతిపరులు, అభిమానులు వచ్చి డీజేలో పాటలకు నృత్యాలు చేశారని చెప్పారు. టీడీపీ వర్గీయులు ప్రభ వద్దకు వచ్చి డీజేను, లారీను ధ్వంసం చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవపల్లిలో వైఎస్సార్ సీపీకి చెందిన పులుసు కోటేశ్వరరావు, రాంబాబులపై జనసేన, టీడీపీలకు చెందిన వారు దాడులు చేయడం అమానుషమని అన్నారు. గ్రామంలో టీడీపీ కార్యకర్తలు డీజే తీసుకొని పై వారి ఇళ్ల మీదుగా వెళుతూ వారి ఇళ్ల వద్ద గంటల తరబడి రచ్చ రచ్చ చేస్తుంటే, ఆడవాళ్లు వచ్చి ముందుకు వెళ్లండయ్యా అని కోరిన రాంబాబు భార్య, ఆమె కూతుర్ని ఆడవాళ్లని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డొచ్చిన రాంబాబును దారుణంగా కొట్టారని చెప్పారు.
రాష్ట్ర మంత్రికి తప్పని ట్రాఫిక్ కష్టాలు
తిరునాళ్లలో మొదటి నుంచి కూడా భక్తులు అనేక కష్టాలు పడ్డారని, పట్టపగలే మధ్యాహ్నం ఒంటిగంట దగ్గర నుంచే పెట్లూరివారిపాలెం వద్ద ట్రాఫిక్ జామ్ అయిందని పేర్కొన్నారు. ఈ సమస్యకు త్రికోటేశ్వరస్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడానికి వచ్చిన దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా చిక్కుకున్నారని చెప్పారు.
అన్నదానంపైనా ప్రతాపం..
కొండపైన భక్తులకు చిలకలూరిపేటకు చెందిన తేళ్ల సుధీర్, శ్రీధర్ అనే వ్యక్తులు మూడేళ్ల నుంచి 20వేలమంది భక్తులకు ఉచితంగా అన్నదానం చేస్తున్నారని, అటువంటి ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని టీడీపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా నిలిపివేశారని, ఇది దారుణమైన విషయమని అన్నారు. సమావేశంలో గోనేపూడి, అరవపల్లి గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులే లేవు..
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి
కోటప్పకొండలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని టీడీపీ వారు స్టేట్మెంట్లు ఇవ్వటం సిగ్గుచేటని, గడిచిన తొమ్మిది నెలల్లో కొండపై ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేయటం చేతకాని ఈ ప్రభుత్వం మా మీద విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమ ని ప్రశ్నించారు. తమ ప్రభు త్వ హయాంలో సుమారు రూ.17 కోట్లతో యలమందరోడ్డు, బ్రిడ్జి నిర్మాణం చేపట్టామని, మూ డు ప్రత్యామ్నాయ రోడ్లు ఏర్పాటుచేశామని, కాల్వకట్ట దగ్గర రూ.90లక్షలు ఖర్చుపెట్టి తారురోడ్డు వేశామని చెప్పారు. రూ.4.5కోట్లతో జేఎన్టీయూ రోడ్డు వేయడం జరిగిందని, ఈ రోడ్డు భక్తులు తిరుగు ప్రయాణానికి ఎంతో సౌకర్యంగా ఉందని, ఈటీ రోడ్డు–యక్కలవారిపాలెం–యాదవ సత్రం రోడ్డును రూ.కోటితో నిర్మించడం జరిగిందని వివరించారు.శివ కుటుంబం విగ్రహాలు కట్టామని, సెంట్రల్ డివైడర్ ఏర్పాటుచేసి లైటింగ్ ఏర్పాటు చేయటం జరిగిందని, నందీశ్వరుడు, దక్షిణామూర్తి విగ్రహాలు తమ హయాంలోనే ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment