ఉద్యోగినులకు ‘ఆట’ విడుపు
నరసరావుపేట: స్థానిక కలెక్టరేట్ పరేడ్గ్రౌండ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లాలోని మహిళా ఉద్యోగులకు క్రీడాపోటీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు పచ్చజెండా ఊపి పోటీలను ప్రారంభించారు. వాలీబాల్, టెన్నికాయిట్ వంటి ప్రొఫెషనల్ ఆటలతో పాటూ మ్యూజికల్ చైర్స్, స్పూన్ రన్నింగ్ రేస్, కళ్ల గంతల వంటి సరదా ఆటలతో మహిళా ఉద్యోగులు రోజంతా ఉల్లాసంగా గడిపారు. వేడుకలలో భాగంగా మహిళా ఉద్యోగుల సేవలు స్మరించుకుంటూ జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు పింక్ బెలూన్లు ఎగరేశారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన మహిళా ఉద్యోగులు పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్, ఎస్పీతో కలిసి మీడియాతో మాట్లాడారు. క్రీడా పోటీల్లో విజయం సాధించిన మహిళలకు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో బహుమతులు అందజేస్తామని వెల్లడించారు. ఉదయం ఔట్ డోర్ గేమ్స్కు ప్రాధాన్యతనిచ్చి, ఎండ వేడిమి దృష్ట్యా మధ్యాహ్నం నుంచి చెస్, క్యారమ్స్ వంటి ఇండోర్ గేమ్స్ నిర్వహించామన్నారు. దాదాపు 500 మంది వరకూ మహిళా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని క్రీడాపోటీలను విజయవంతం చేశారన్నారు.
మహిళా దినోత్సవం
సందర్భంగా ఆటల పోటీలు
పరేడ్ గ్రౌండ్లో ప్రత్యేక ఏర్పాట్లు
రోజంతా పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన క్రీడా పోటీలకు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎండ తీవ్రత దృష్ట్యా షామియానాలు ఏర్పాటు చేయడంతో పాటూ ప్రతి మహిళా ఉద్యోగికి తెల్లటి టోపీలు అందజేశారు. మధ్యాహ్నం పరేడ్ గ్రౌండ్లోనే జిల్లా కలెక్టర్ స్వయంగా అందరికీ రుచికరమైన భోజనాలు వడ్డించారు. పోలీసుశాఖ ఏర్పాటుచేసిన జాగిలాలు, ఆయుధాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే, డీఆర్వో ఎ.మురళి, డీఎఫ్ఓ కృష్ణప్రియ, ఆర్డీఓ కె.మధులత, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఉద్యోగినులకు ‘ఆట’ విడుపు
Comments
Please login to add a commentAdd a comment