సంక్షేమం ఫ్రీజ్‌ | - | Sakshi
Sakshi News home page

సంక్షేమం ఫ్రీజ్‌

Published Wed, Mar 12 2025 8:02 AM | Last Updated on Wed, Mar 12 2025 8:01 AM

సంక్ష

సంక్షేమం ఫ్రీజ్‌

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో కొలువుల జాతర
అబద్ధాల విష వలయం చుట్టుముడితే.. ఆకాశానికి నిచ్చెన వేసి ఆశల పల్లకీలో ఊరేగిస్తే.. అరచేతిలో వైకుంఠం చూపి మంత్రదండంలా ఆడిస్తే నిజమని నమ్మిన సామాన్యుడు.. కాల‘కూటమి’ చక్రబంధనంలో చిక్కుకున్నాడు.. అది మాయాచట్రమని తెలుసుకునేలోపు నివురుగప్పిన మోసం నిలువునా ముంచేసింది. బంగారు భవితను అంధకారం చేసింది. ఇంటికో ఉద్యో గం.. నిరుద్యోగ భృతి అంటూ యువగళంలో పోసిన గరళం అంపశయ్యపైకి చేర్చింది. తల్లికి వందనం పేరిట ‘అమ్మఒడి’లో రేపిన మంట కార్చిచ్చులా చుట్టుముట్టింది. విద్యా దీవెనలు.. శాపాల శరాఘాతాలై నిలువెల్లా తాకాయి. ఫలితంగా దగా పడ్డ తెలుగుబిడ్డ ఆగ్రహజ్వాలతో గళమెత్తి గర్జిస్తున్నాడు. కూటమి సర్కారుపై కన్నెర్రజేసి ఖబడ్దార్‌ అంటూ హెచ్చరిస్తున్నాడు. ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో దళమై కదంతొక్కేందుకు సిద్ధపడ్డాడు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా జిల్లాలో సుమారు ఐదు వేల మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా మరో ఐదు వందల మందికి ఉపాధి దొరికింది. చాలా మంది తమ సొంత గ్రామాలు, సొంత మండలాల్లో ఉపాధి పొందారు. అప్పట్లో హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్‌ ఉద్యోగాలు చేస్తున్నవారు సొంత ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం గమనార్హం. ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాల కల్పన గతంలో ఎన్నడూ జరిగిన దాఖలాలు లేవు. వైద్య ఆరోగ్య శాఖలో రెండు వేలకు పైగా ఉద్యోగాలు కల్పించారు. అలాగే ఇతర శాఖల్లో శాశ్వత, కాంట్రాక్టు పోస్టులు భర్తీ చేశారు. అప్కాస్‌ పేరిట వేలాది మందికి అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే స్థానిక యువతకు వలంటీర్‌ వ్యవస్థ ద్వారా భారీగా ఉపాధి కల్పించడం విశేషం. జిల్లాలో సుమారు పది వేల మందికిపైగా మంది వలంటీర్లుగా సొంత గ్రామంలో ఉపాధి పొందారు. ప్రజల ముంగిళ్లలోకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లారు.

పచ్చి మోసం

టీడీపీ కూటమి ప్రభు త్వం విద్యార్థులు, యువతను పచ్చి మోసం చేస్తోంది. గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌ వసతి దీవెనకు రూ.1,800 కోట్లు మంజూరుచేశారు. ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఏమీ మంజూరు చేయలేదు. నిరుద్యోగ భృతి రూ.3వ ేలు ఇస్తామని చెప్పి బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు. గత ప్రభుత్వం 17 మెడికల్‌ కళాశాలల నిర్మాణం చేపట్టి, ఐదింటిలో తరగతులు ప్రారంభిస్తే ఈ సర్కారు వాటిని ప్రైవేటు పరం చేసేందుకు పావులు కదుపుతోంది. ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఇప్పటివరకు కొత్తగా ఒక్క జాబ్‌ కూడా ఇవ్వలేదు. పైగా ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నారు.

– గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్‌, విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షులు, వైఎస్సార్‌ సీపీ

ఉద్యోగం కోసం నిరీక్షణ

నేను బీటెక్‌ పూర్తి చేశా. ఎలాంటి ఉద్యోగం లేకపోవడంతో హైదరాబాద్‌లో కంప్యూటర్‌ కోర్సులో శిక్షణకు వెళుతున్నా. జనవరిలోనే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటి వరకూ ఆ ఊసే ఎత్తడం లేదు. నిరుద్యోగ భృతిపై ఎలాంటి ప్రకటనా చేయటం లేదు. అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట. ఇప్పుడొక మాట. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోంది.

– వల్లెం ఈశ్వర్‌ సాయికుమార్‌, నిరుద్యోగి, సత్తెనపల్లి

సాక్షి ప్రతినిధి, గుంటూరు: అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికొక ఉద్యోగం ఇస్తాం.. యువతకు ఉపాధి కల్పిస్తాం.. సంపద సృష్టించి అభివృద్ధి చేస్తాం.. నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు భృతి ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఊదరగొట్టారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా కొత్త ఉద్యోగం ఇవ్వలేదు. పైగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇంటర్‌, డిగ్రీ, డిప్లమా, ఐటీఐ, ఇంజినీరింగ్‌, పీజీ ఇలా ఏదో ఒకటి పూర్తిచేసిన నిరుద్యోగులు ఐదు లక్షల 58 వేల మంది ఉన్నారని అంచనా. వీరికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ దిశగా సర్కారు చర్యలు తీసుకోవడం లేదు. నిరుద్యోగ భృతి ఊసే లేదు. బడ్జెట్లోనూ కేటాయింపులు చేయలేదు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ, తొలి సంతకం అంటూ ఆర్భాటం చేసిన చంద్రబాబు ఇప్పటివరకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లూ ఇవ్వడం లేదు. ఫలితంగా యువత నిరసన గళం విప్పుతోంది.

బాబు వల్ల విద్యారంగం నిర్వీర్యం

బాబు పాలనలో విద్యారంగం నిర్వీర్యమైపో తోంది. గత ప్రభుత్వంలో అమలైన ఫీజు రీయింబర్స్‌మెంట్‌(విద్యాదీవెన), వసతి దీవెన పథకాలు అటకెక్కాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పేరుకుపోవడంతో కళాశాలల నుంచి ఎప్పుడు బయటకు గెంటేస్తారో తెలీక విద్యార్థులు సతమతమవుతున్నారు. ఇప్పటికే చదువు పూర్తయిన విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఫలితంగా ఉద్యోగాల కోసం యత్నిస్తున్న వారు అవస్థలు పడుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ కాలేజీలకు ఫీజులు చెల్లిస్తున్నారు. అప్పులకు వడ్డీ భారం పెరుగుతున్నా.. సర్కారులో మాత్రం చలనం ఉండట్లేదు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉండగా, ఫీజులు చెల్లిస్తేనే ఈ ఏడాది పరీక్షలకు అనుమతిస్తామని కళాశాలల నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు.

వైఎస్సార్‌ సీపీ ఉద్యమబాట

వైఎస్సార్‌ సీపీ నిరుద్యోగ యువత, విద్యార్థుల పక్షాన ఉద్యమ బాట పట్టింది. ఫీజు రియంబర్స్‌మెంట్‌, నిరుద్యోగ భృతి, వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ బుధవారం ‘యువత పోరు’ పేరుతో వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టనున్నారు. జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ వద్ద ధర్నా, కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు.

భారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు తల్లికి వందనం, విద్యాదీవెన, వసతి దీవెనకు మంగళం నిరుద్యోగ భృతి అడ్రస్‌ గల్లంతు ఉపాధి లేదు.. ఉద్యోగం రాదు.. యువత తరఫున నేడు వైఎస్సార్‌ సీపీ పోరుబావుటా ప్రతిపక్షానికి అన్నివర్గాల నుంచి విశేష మద్దతు

తల్లికి వందనం ఎక్కడ?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే గత ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. గతంలో నాలుగేళ్లపాటు నిరాటంకంగా అమలైన జగనన్న అమ్మ ఒడి ఆర్థిక ప్రోత్సాహం ఆగిపోయింది. ఏటా తల్లుల ఖాతాల్లో జమైన రూ.15వేలు పిల్లల చదువులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కరోనా సంక్షోభంలోనూ అమ్మఒడి ఆగలేదు. కూటమి సర్కారు వచ్చాక తల్లికి వందనం అని చెప్పి మొత్తంగా ఎగ్గొట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సంక్షేమం ఫ్రీజ్‌1
1/3

సంక్షేమం ఫ్రీజ్‌

సంక్షేమం ఫ్రీజ్‌2
2/3

సంక్షేమం ఫ్రీజ్‌

సంక్షేమం ఫ్రీజ్‌3
3/3

సంక్షేమం ఫ్రీజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement