తోడు దొంగలు చిక్కరు..దొరకరు | - | Sakshi
Sakshi News home page

తోడు దొంగలు చిక్కరు..దొరకరు

Apr 3 2025 2:04 PM | Updated on Apr 3 2025 2:04 PM

తోడు దొంగలు చిక్కరు..దొరకరు

తోడు దొంగలు చిక్కరు..దొరకరు

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌): ఇద్దరూ తోడు దొంగలు.. ఒంటరిగా వెళ్లే మహిళల మెడల్లో బంగారు గొలుసులు తెంచుకెళ్లడంలో నేర్పరులు. సీసీ కెమెరాలకు చిక్కరు.. దొరకరు.. మూడేళ్లలో 13కుపైగా దొంగతనాలు చేసినా ఏ పీఎస్‌ పరిధిలోనూ వీరిపై కేసుల్లేవు. ఎట్టకేలకు నల్లపాడు పోలీసులు వీరి ఆట కట్టించారు. ఇద్దరినీ అరెస్టు చేసి వారి వద్ద రూ.32 లక్షల విలువ చేసే 390 గ్రాముల బంగారు సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాలను ఎస్పీ సతీష్‌కుమార్‌ బుధవారం నగరంపాలెం జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గత నెలలో నల్లపాడు పీఎస్‌ పరిధిలోని లింగయ్యపాలెంలో, గుంటూరు క్లబ్‌ దగ్గర్లో ఒంటరిగా నడిచి వెళ్లే మహిళల మెడల్లో బంగారు గొలుసులను దుండగులు తెంచుకెళ్లారు. దీనిపై సీఐ వంశీధర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలించారు. ఏటుకూరురోడ్‌ డీఎస్‌ నగర్‌ తొమ్మిదో వీధిలో ఉంటున్న టైలర్‌ వల్లెపు శ్రీనును అనుమానితుడిగా అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అతనిచ్చిన సమాచారంతో వసంతరాయపురం నాలుగో వీధికి చెందిన అన్నపురెడ్డి శివ సుబ్రహ్మణ్యంను అరెస్టు చేశారు. వీరిద్దరూ కలిసి బంగారు గొలుసుల చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. వీరు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో చోరీలు చేసినట్టు తేల్చారు. ఇప్పటివరకు 13కుపైగా చోరీలకు పాల్పడినా వీరిపై కేసులు లేవని గుర్తించారు. వీరి వద్ద నుంచి రూ.32 లక్షల ఖరీదు చేసే 390 గ్రాముల బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. కేసును దర్యాప్తు చేసిన సీఐ వంశీధర్‌, ఎస్‌ఐ జనార్దన్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ సుబ్బారావు, కానిస్టేబుళ్లు సాంబశివరావు, మస్తాన్‌వలి, బిక్షనాయక్‌, వెంకటేశ్వర్లును ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలను అందించారు.

థియేటర్లో పరిచయంతో స్నేహితులుగా మారి..

శివసుబ్రహ్మణ్యం 2009లో చీరాల నుంచి గుంటూరు వచ్చి స్థిరపడ్డాడు. తొలినాళ్లలో ఆటోడ్రైవర్‌గా పనిచేసేవాడు. 2018లో ఓ సినిమా ఽథియేటర్‌లో టైలర్‌ శ్రీను పరిచయమయ్యాడు. ఇద్దరికీ ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో 2022 నుంచి చోరీలకు శ్రీకారం చుట్టారు. ఒంటరిగా వెళ్లే మహిళల మెడల్లో బంగారు గొలుసులు తెంచుకెళ్లడం ప్రారంభించారు. స్కూటీపై వెళ్తూ గొలుసులు తెంచుకెళ్లేవారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా, ఆధారాల్లేకుండా జాగ్రత్తపడటంలో వీరు నేర్పరులు. ధనవంతులు ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా చోరీలు చేశారు. దొంగలించిన సొత్తును తెలిసిన వారి ద్వారా బంగారు దుకాణాల్లో విక్రయించేవారు. ఆ సొమ్ముతో అప్పులు తీర్చుకుని జల్సాలు చేసేవారు. వీరు పట్టాభిపురం పీఎస్‌ పరిధిలో 2, నల్లపాడు పీఎస్‌ పరిధిలో 4, తెనాలి వన్‌టౌన్‌ పరిధిలో 2, అరండల్‌ పేట పీఎస్‌, తెనాలి త్రీటౌన్‌ పీఎస్‌, చీరాల టూ టౌన్‌, చీరాల త్రీ టౌన్‌ పీఎస్‌ పరిధిలో ఒక్కొక్క చోరీ చేసినట్టు విచారణలో పోలీసులు తేల్చారు.

గొలుసుల చోరీల్లో దిట్టలు మూడేళ్లలో 13కుపైగా దొంగతనాలు ఏ పీఎస్‌లోనూ కేసుల్లేవు ఎట్టకేలకు అరెస్టు చేసిన పోలీసులు రూ.32 లక్షల విలువ చేసే 390 గ్రాముల బంగారు సొత్తు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement