
కాలువలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
నకరికల్లు: ప్రమాదవశాత్తూ కాలువలో జారిపడి గల్లంతైన యువకుడి మృతదేహం బుధవారం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాజుపాలెం మండలం పెదనెమలిపురి గ్రామానికి చెందిన దూదేకుల హర్షదుల్లా (21) మార్చి 31న తన మిత్రులతో కలసి మండలంలోని శ్రీరాంపురం సమీపంలోని బెల్లంకొండ బ్రాంచి కెనాల్లో ఈత కొట్టేందుకు వెళ్లాడు. మిత్రులందరూ ఈత కొడుతుండగా హర్షదుల్లా కాలువ ఒడ్డున కూర్చొని నీళ్లు తాగుతుండగా ఒడ్డు విరిగి జారిపడి కాలువలో గల్లంతయ్యాడు. ఎంత వెదికినా ఫలితం లేకపోయింది. బుధవారం హర్షదుల్లా మృతదేహం నీటిపైకి తేలడంతో వెలికితీశారు. మృతుడు వెటర్నరీ డిప్లమో కోర్సు పూర్తి చేశాడు. తండ్రి హాసన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చల్లా సురేష్ తెలిపారు. చేతికొచ్చిన కొడుకు అకాలమృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
నదిలో గల్లంతైన యువకుని మృతదేహం లభ్యం
అమరావతి: నదిలో చేపలు పట్టడానికి వెళ్లి మంగళవారం గల్లంతైన యువకుడి మృతదేహం బుధవారం లభ్యమైంది. కృష్ణానదిలో అమరేశ్వరస్వామి గుడి సమీపంలో గల్లంతైన స్థానిక బీసీ కాలనీకి చెందిన నల్లకొట్ల రాజేష్(19) మృతదేహం బుధవారం మధ్యాహ్నం లభ్యమైంది. నదిలో గజ ఈతగాళ్లు బుధవారం ఉదయం నుంచి గాలిస్తుండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాజేష్ మృతదేహాన్ని కనుగొని ఒడ్డుకు చేర్చారు. అమరావతి పోలీసులు రాజేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. శవపంచనామా చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని రాజేష్ కుటుంబసభ్యులకు అప్పగించారు.
బార్ అసోసియేషన్
నూతన కార్యవర్గ పరిచయం
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ కొత్త కార్యవర్గ పరిచయ కార్యక్రమం బుధవారం జరిగింది. ముఖ్యఅతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. గెలుపొందిన అభ్యర్థులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తితోపాటు పలు జడ్జిలు అభినందనలు తెలిపారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల అధికారి కాసు వెంకటరెడ్డిని పలువురు న్యాయవాదులు, బార్ కౌన్సిల్ మెంబర్ వట్టి జొన్నల బ్రహ్మారెడ్డి అభినందించారు. బార్ కొత్త అధ్యక్షుడు వెంగళ శెట్టి శివ సూర్యనారాయణ మాట్లాడుతూ న్యాయవాదుల ప్రయోజనాల కోసం పాటుపడతానని హామీ ఇచ్చారు.

కాలువలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం