
మోసపోయాం.. న్యాయం చేయండి
నరసరావుపేట: వివిధ రకాల కాయిన్ క్రిఫ్టో కరెన్సీ పేర్లతో తమను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకొని తమ డబ్బు తిరిగి ఇప్పించాలని పట్టణానికి చెందిన పలువురు బాధితులు జిల్లా ఎస్పీని కోరారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా అడ్మిన్ ఎస్పీ జేవీ సంతోష్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు జిల్లా నలుమూలల నుంచి హాజరైన బాధితులు కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, మోసం, చోరీల సమస్యలకు సంబంధించి 88 ఫిర్యాదులు అందజేశారు.
ఉద్యోగం ఇప్పిస్తామని రూ.2.50లక్షలు మోసం
విజయవాడలో నాగరాజు అనే వ్యక్తి ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లేస్మెంట్స్ నడుపుతున్నాడు. అతని దగ్గర పని చేసే లతా ఇద్దరు కలిసి నాకు ఉద్యోగం ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి రూ.2.50లక్షలు తీసుకున్నారు. డబ్బులు అడుగుతున్నప్పటికీ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. విచారించి, న్యాయం చేయండి. –వలేరు హనుమ, అచ్చంపేట
తక్కువ ధరకు బంగారం అంటూ మోసం
మాకు చేపూరి పూర్ణచంద్రరావు పరిచయమై తను నడికుడి ఎస్బీఐ బ్రాంచ్లో గోల్డ్ అప్రైజర్గా పని చేస్తున్నట్లు నమ్మబలికి బ్యాంకులో బంగారం వేలం వచ్చిందని, తక్కువ రేటుకు ఇప్పిస్తానంటూ మా వద్ద నుంచి చెరో రూ.2లక్షలు తీసుకున్నాడు. బంగారం గురించి అడిగితే వాయిదాలు వేస్తుండగా అనుమానం వచ్చి అతని గురించి విచారించామన్నారు. గతంలో నరసరావుపేటలో చీటీలు వేసి జనాన్ని మోసం చేసినట్లు, నడికుడి ఎస్బీఐ బ్యాంకులో ఉద్యోగం మానివేసినట్లు తెలిసింది. మోసం చేసిన పూర్ణచంద్రరావుపై చట్టపరంగా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయండి.
– కొప్పుల ఉపేంద్ర, షేక్ హసన్వలి, కేసానుపల్లి, దాచేపల్లి మండలం
మమ్మల్ని కొట్టి మాపైనే తప్పుడు కేసు
మేము వ్యవసాయ పనులకు వెళ్లిన సమయంలో మా ట్రాక్టర్ను ఉద్దేశపూర్వకంగా కొర్రా లక్ష్మణనాయక్ తన ట్రాక్టర్తో ఢీకొట్టాడు. గాయాలైన మేము గతేడాది సెప్టెంబరు 10న స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేశాం. దీంతో నాయక్, అతనికి చెందిన పదిమంది మాపై దాడిచేసి మమ్మల్ని తరిమివేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదుచేసినా ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిందితుల ఫిర్యాదుతీసుకొని మాపై తప్పుడు కేసు నమోదుచేశారు. నకరికల్లు పోలీసులను పదే పదే కలవగా మా ఫిర్యాదును అప్పుడు కేసుగా ఫైల్చేశారు. దీనివల్ల మాకు తీరని అన్యాయం జరిగింది. ఈ రెండు ఎఫ్ఐఆర్లపై సమగ్ర విచారణ చేసి న్యాయం చేయండి.
– ముడావత్ లఘుపతినాయక్, లలీత్బాయ్, శివాపురం తండా, నకరికల్లు
ఆస్తికోసం మద్యం తాగి వచ్చి తిడుతున్నాడు
నా మనవడు గణేష్ అతని భార్య జయలక్ష్మిలు ఆస్తి వారిపేరిట రాయమని ప్రతిరోజు అసభ్య పదజాలంతో తిడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మనవడు ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి తిడుతున్నాడు. దీనిపై ఇప్పటికే గతనెల 13వ తేదీన పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాం. వారిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. వారి నుంచి నాకు ప్రాణ రక్షణ కల్పించండి.
–ముక్తవరపు పిచ్చయ్య, పాతురు, నరసరావుపేట
అదనపు ఎస్పీకి ఫిర్యాదుచేసిన బాధితులు పీజీఆర్ఎస్కు 88 ఫిర్యాదులు
క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.40లక్షలు మోసం
హైదరాబాదు కేంద్రంగా పైతాన్ కాయిన్ క్రిప్టో రెన్స్ ఆన్లైన్ నెట్వర్క్ నిర్వహిస్తున్న నాగేశ్వర్కు ఏజెంట్ రవికుమార్ మాటలు విని రూ.40లక్షలు పెట్టుబడి పెట్టాం. సంస్థను ఈగల్ కాయిన్ క్రిప్టో కరెన్సీ నెట్వర్క్గా పేరు మార్చారు. మాకు అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే ఇవ్వకుండా సాకులు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు. మమ్మల్ని మోసం చేసిన వారిపై చర్యలు తీసుకొని మా డబ్బులు ఇప్పించాలని మనవిచేస్తున్నాం.
– జి.వెంకటేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, సతీష్, బాలశ్రీనివాస్ తదితరులు

మోసపోయాం.. న్యాయం చేయండి

మోసపోయాం.. న్యాయం చేయండి

మోసపోయాం.. న్యాయం చేయండి