
‘విద్యామిత్ర’ స్టాక్ పాయింట్ల పరిశీలన
● వివిధ పాఠశాలలు పరిశీలించిన రాష్ట్ర పరిశీలకురాలు వనజ ● జిల్లాలో 6 పాయింట్ల గుర్తింపు
నరసరావుపేట ఈస్ట్: పల్నాడుజిల్లా పరిధిలోని 1,46,044 మంది విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా అందించనున్న వస్తువులను జాగ్రత్తగా భద్రపరచాలని పథకం రాష్ట్ర పరిశీలనాధికారి వనజ తెలిపారు. విద్యా మిత్ర ద్వారా అందించే వస్తువులను భద్రపరిచే స్టాక్ పాయింట్లను మంగళవారం జిల్లా సీఎంఓ పద్మారావు, ఇతర అధికారులతో కలసి పరిశీలించారు. జిల్లాలో శంకర భారతీపురం జెడ్పీ హైస్కూల్ (నరసరావుపేట), జెడ్పీ హైస్కూల్ (రొంపిచర్ల), జెడ్పీ హైస్కూల్ (నకరికల్లు), జెడ్పీ హైస్కూల్ (నాదెండ్ల), సెయింటాన్స్ స్కూల్ (యడ్లపాడు), శారదా హైస్కూల్ (చిలకలూరిపేట) స్టాక్ పాయింట్లుగా గుర్తించారు. రాష్ట్ర పరిశీలకులు వనజ మాట్లాడుతూ, విద్యామిత్ర ద్వారా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగులు, షూస్, బెల్ట్, డిక్షనరీలను అందిస్తున్నట్టు వివరించారు. వాటి భద్రతకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షానికి తడవకుండా, చెదలు పట్టకుండా చూడాలన్నారు. విద్యా మిత్ర మెటీరియల్ సరఫరాకు రహదారి పరంగా ఇబ్బందులు లేకుండా స్టాక్ పాయింట్లను గుర్తించటంపై విద్యాశాఖాధికారులను అభినందించారు.