
ఎయిడెడ్ ఉపాధ్యాయుల జీతాలు వెంటనే చెల్లించాలి
బాపట్లటౌన్ పర్చూరు మండలం, చెరుకూరు ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మాకు గడిచిన 15 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఉపాధ్యాయులు మంగళవారం డీఈవో పురుషోత్తమ్కు వినతిపత్రం అందజేశారు. చెరుకూరు ఆంధ్ర కేసరి మెమోరియల్ రెసిడెన్సి ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో పనిచేసే గణిత ఉపాధ్యాయుడు సీహెచ్ వెంకటేశ్వర్లు, తెలుగు పండిట్ కె పద్మావతమ్మలకు పాఠశాల యాజమాన్యం వలంటరీ రిటైర్మెంట్ ఇవ్వలేదని 2024 ఫిబ్రవరి నెల నుంచి ఏప్రిల్ 2025 వరకు వారి జీతాల బిల్లులు యాజమాన్యం మండల విద్యాశాఖ అధికారికి పంపలేదన్నారు. ఈ విషయంపై డీఈవో ప్రత్యేక అధికారాలను ఉపయోగించి మాకు రావలసిన 15 నెలల జీతాలు చెల్లించాలన్నారు. దీనిపై స్పందించిన డీఈవో విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.
జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో కానిస్టేబుల్ ప్రతిభ
బాపట్లటౌన్: జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో బాపట్ల జిల్లా ఖ్యాతి ఇనుమడింపచేయటం హర్షనీయమని జిల్లా ఎస్పీ తుషార్డూడీ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాపట్ల జిల్లా, చందోలు పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న నాగ బ్రహ్మారెడ్డిని జిల్లా ఎస్పీ అభినందించి స్విమ్మింగ్లో సాధించిన మెడల్స్తో సత్కరించి, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ నాగ బ్రహ్మారెడ్డి 2025 ఫిబ్రవరి 2న విజయవాడలో జరిగిన 25వ కృష్ణా రివర్ క్రాసింగ్ స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటారన్నారు. దుర్గా ఘాట్ నుంచి 1.5 కిలోమీటర్ల దూరాన్ని 21 నిమిషాలలో ఈది పూర్తిచేసి విజేతగా నిలిచాడు. 2025 మార్చి 24 నుండి 28వ తేదీలలో గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్లో జరిగిన 72వ ఆల్ ఇండియా పోలీస్ ఆక్వాటిక్స్ క్లస్టర్ చాంపియన్ షిప్ 2024–2025 పోటీలలో పాల్గొని సత్తా చాటారన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుజరాత్ లోని గాంధీనగర్లో జరిగిన స్విమ్మింగ్ పోటీలలో పాల్గొని విజేతగా నిలవడంతోపాటు గతంలో జాతీయ స్థాయిలో మరో 4 అవార్డులు అందుకున్నారన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరెన్నో క్రీడా పోటీలలో పాల్గొని సత్తా చాటాలన్నారు. పోలీస్ శాఖలో విధులు నిర్వహించే పోలీస్ అధికారులు సిబ్బంది బ్రహ్మారెడ్డి స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొని ప్రతిభ కనబరచాలన్నారు. క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచే పోలీస్ అధికారులను సిబ్బందిని ప్రోత్సహిస్తామన్నారు.
కానిస్టేబుల్కు పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు
వేటపాలెం: దేశాయిపేట పంచాయతీ ప్రసాద్నగర్లో వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ బిల్లా రమేష్ భౌతికకాయానికి పోలీస్ లాంఛనాలతో రూరల్ ఐఈ శేషగిరిరావు, వేటపాలెం ఎస్సై వెంకటేశ్వర్లు సారథ్యంలో స్థానిక శ్మశానవాటికలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగా రూరల్ సీఐ, ఎస్సై కానిస్టేబుల్ భౌతికకాయానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ మాట్లాడుతూ 2009 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ బిల్లా రమేష్ మృతి పట్ల ఎస్పీ తుషార్ డూడీ తన సంతాపం వ్యక్తం చేశారు.

ఎయిడెడ్ ఉపాధ్యాయుల జీతాలు వెంటనే చెల్లించాలి