
వసూళ్ల పేరిట వేధింపులకు గురి చేస్తే చర్యలు
బాపట్లటౌన్: ఫైనాన్స్ సొమ్ము వసూళ్ల పేరుతో వేధింపులకు పాల్పడితే సహించేది లేదని పట్టణ సీఐ రాంబాబు హెచ్చరించారు. బాపట్ల పట్టణం, రూరల్ పరిధిలోని మైక్రో ఫైనాన్స్, ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్స్ వ్యాపారాల నిర్వాహుకులు, రికవరీ ఏజెంట్లతో పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. సీఐ రాంబాబు మాట్లాడుతూ రుణగ్రహీతలు తీసుకున్న లోన్లు సకాలంలో చెల్లించకపోతే నిబంధనల మేరకే వ్యవహరించాలన్నారు. రుణగ్రహీతలను ఎలాంటి వేధింపులకు గురి చేయరాదన్నారు. కంపెనీ ద్వారా లీగల్గా నోటీసులు అందజేసి కోర్టు జారీచేసే ఆదేశాల మేరకు నడుచుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించి రుణగ్రహీతలను ఇబ్బందులకు గురిచేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రూరల్ సీఐ శ్రీనివాసరావు, సర్కిల్ సీఐ హరికృష్ణ పాల్గొన్నారు.
బాపట్ల పట్టణ సీఐ రాంబాబు
ప్రైవేటు బ్యాంకర్లు, ఫైనాన్స్ సంస్థల ఏజెంట్లతో సమావేశం