
నిషేధిత పత్తి విత్తనాల విక్రయం నేరం
సత్తెనపల్లి: నిషేధిత పత్తి విత్తనాలు విక్రయించటం నేరమని ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ ఏడీఏ ఆర్. శశిధర్ రెడ్డి అన్నారు. గుంటూరులోని వ్యవసాయ శాఖ డైరెక్టర్, కమిషనర్ ఆదేశాల మేరకు ఆ కార్యాలయం నుంచి వచ్చిన ఏడీఏ పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పలు విత్తన దుకాణాల్లో బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్టీఈ విత్తనాల నిల్వలు, అమ్మకాలకు రాష్ట్రంలో అనుమతి లేదన్నారు. వాటిని విక్రయించటం చట్టరీత్యా నేరమన్నారు. తనిఖీలలో డీలర్ల దగ్గర ఆ విత్తనాలు లభించలేదన్నారు. రైతులకు తప్పనిసరిగా విత్తన కొనుగోలు రసీదు ఇవ్వాలన్నారు. సత్తెనపల్లి మండల వ్యవసాయ అధికారి ఎస్.శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ విత్తన డీలర్లు గుర్తింపు పొందిన డిస్ట్రిబ్యూటర్ నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. రైతులు లైసెన్స్ ఉన్న డీలర్ల నుంచి విత్తనాలు తీసుకోవాలన్నారు. మధ్యవర్తుల వద్ద కొనుగోలు చేయరాదన్నారు. మధ్యవర్తుల సమాచారం ఉంటే అధికారులకు తెలియజేయాలని సూచించారు. తనిఖీలలో వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయ మండల వ్యవసాయ అధికారి వీఎస్ సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.
సబ్ జైలులో జిల్లా
జడ్జి పరిశీలన
రేపల్లె రూరల్: రేపల్లె సబ్ జైల్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సయ్యద్ జియావుద్దీన్ బుధవారం సందర్శించారు. జైలు పరిసరాలను, ఖైదీల గదులను, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడారు. నేరం ఆరోపించబడి ప్రైవేటు న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని వారి కోసం ప్రభుత్వం ఉచిత న్యాయ సేవలు అందించేందుకు ప్రభుత్వ న్యాయవాదిని ఏర్పాటు చేసిందన్నారు. అవసరమైన వారు ప్రభుత్వ న్యాయవాది సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాది గుమ్మడి కుమార్బాబు, సబ్ జైల్ సూపరింటెండెంట్ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
పిడుగురాళ్ల : పట్టణంలోని శ్రీ రామ తీర్థ సేవాశ్రమం బజార్లోని శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఇటీవల ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. బుధవారం గాయత్రి పీఠం ప్రధాన అర్చకులు విష్ణువర్ధన్ శర్మ శాస్రోక్తంగా పూజలు నిర్వహించి మేధా దక్షిణామూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు. అనంతరం కందుల శ్రీనివాసరావు తండ్రి జ్ఞాపకార్థం రూ. 17 లక్షలను ఆలయ పునర్నిర్మాణానికి అందించారు. వేలమంది భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అగ్ని ప్రమాదాల
నివారణపై అవగాహన
పట్నంబజారు: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బందితో పలు ప్రాంతాల్లో ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. సంగడిగుంట, పొన్నూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లు, విద్యుత్ తీగల వల్ల జరిగే అగ్ని ప్రమాదాలపై మాక్డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం ప్రచార వాల్పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేశారు. గుంటూరు–2 ఫైర్ స్టేషన్ అధికారి పి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

నిషేధిత పత్తి విత్తనాల విక్రయం నేరం