
మే 10న జాతీయ లోక్ అదాలత్
పార్వతీపురంటౌన్: న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్యను తగ్గించడానికి, వివాదాలను ముందుదశలోనే పరిష్కరించడానికి లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా రెండవ అదనపు జడ్జి, మండల న్యాయ సేవా కమిటీ అధ్యక్షుడు ఎస్.దామోదర రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి మే 10వ తేదీన మొదటి జాతీయ లోక్అదాలత్ జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించనున్నామన్నారు. లోక్ అదాలత్ ద్వారా ప్రజలు పెండింగ్లో ఉన్న కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని సూచించారు. సివిల్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ ప్రమాద పరిహార కేసులు, ఇతర వివాదాలను పరిష్కరించడానికి లోక్అదాలత్ వారధిగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. కక్షిదారులు రాజీ చేసుకోవడం వల్ల ఖర్చులు తగ్గుతాయని, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగేకన్నా కేసులను సామరస్యంగా పరిష్కరించుకుని రాజీ చేసుకోవడమే ఉత్తమ మార్గమన్నారు. కోర్టుకు ఎటువంటి ఫీజు చెల్లించకుండా, కేసులు రాజీ చేసుకోవచ్చని సూచించారు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కారమైతే కోర్టుకు మొదట చెల్లించిన రుసుమును కక్షిదారులకు కోర్టు తిరిగి చెల్లిస్తుందని పేర్కొన్నారు. లోక్ అదాలత్లో బాధితులకు న్యాయం త్వరగా లభించే అవకాశం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క కక్షిదారు వినియోగించుకుని లబ్ధి పొందాలని పిలుపునిచ్చారు.