
● పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల గ్రా డ్యుయేట్, టీచర్స్ నియోజవర్గాల ఎన్నికలకు స ర్వం సిద్ధమైంది. మొత్తం 15 జిల్లాలు 42నియోజకవర్గాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ కేంద్రంగా జరుగుతున్న ఈ ఎన్నికలకు కలెక్టర్ పమేలా సత్పతి రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరించనున్నారు. బుధవారం ఉదయమే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సామగ్రితో సిబ్బంది, పోలీసులు వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు చేరారు. నోటిఫికేషన్ విడుదలైన నాటినుంచి హోరాహోరీ ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు బుధవారం పోల్ మేనేజ్మెంట్పై దృష్టిసారించా రు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజా మాబాద్లో మొత్తం 773 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆర్వో పమేలాసత్పతి తెలిపారు. గ్రాడ్యుయేట్స్ కోసం 499, టీచర్స్ కోసం 274, ఉమ్మడిగా 93 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. అత్యధిక ఓటర్లతో కరీంనగర్ జిల్లా 103 పోలింగ్ కేంద్రాలు కలిగి ఉంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, ఓటరు కార్డుతో సహా 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చని తెలిపారు. ఈ పట్టభద్రుల బరిలో 56 మంది, ఉపాధ్యాయ పోటీలో 15 మంది ఉన్నారు.
కేంద్రాలకు చేరిన ఎన్నికల సామగ్రి
ఎమ్మెల్సీ ఎన్నికలో విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, పేపర్లు ఇతర సామగ్రితో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. ప్రతీ పోలింగ్ స్టేషన్కు ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, అదనపు ప్రిసైడింగ్ ఆఫీసర్, మరో ఉద్యోగితో పాటు భద్రతకు పోలీసులను కేటాయించారు. వీరంతా గురువారం ఉదయం 6.30గంటలకు పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభిస్తారు. 7గంటలకు ఏజెంట్ల సమక్షంలో మాక్పోలింగ్ నిర్వహిస్తారు. ప్రతీ కేంద్రం వద్ద వెబ్కాస్టింగ్తో పాటు సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు. పోలింగ్కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలులో ఉంటున్నందున కేంద్రానికి 100మీటర్ల పరిధిలో ఎవరూ ఉండకూడదని పోలీసులు సూచించారు. పోలింగ్ అనంతరం సిబ్బంది బ్యాలెట్ బాక్సులను సీజ్ చేసి కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంకు తరలిస్తారు. మొత్తం 15జిల్లాల్లోని 271మండలాల నుంచి బ్యాలెట్ బాక్సులు శుక్రవారం ఉదయంలోపు ఇక్కడికి చేరనున్నాయి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో 56మంది.. 3,55,159ఓట్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నుంచి అంజిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నరేందర్రెడ్డి, బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణతో కలిపి మొత్తం 56మంది పోటీ పడుతున్నారు. 3,55,159మంది ఓటర్లు 499పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా 1,60,260మంది పట్టభద్రులు, 200పోలింగ్ కేంద్రాల్లో ఓటేయనున్నారు.
టీచర్స్ బరిలో 15మంది.. 27,088 ఓటర్లు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య, పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్రెడ్డి, టీపీటీఎఫ్, యూటీఎఫ్, యూఎస్పీసీ మద్దతుతో వై.ఆశోక్కుమార్, ఎస్టీ యూ, సీపీఎస్ల నుంచి కూర రఘోత్తంరెడ్డిలతో కలిపి 15మంది ఉన్నారు. 274 పోలింగ్ కేంద్రాల్లో 27,088మంది ఓటు వేయనున్నారు. ఉమ్మడి కరీంనగర్లో 8,135 మంది 65పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
ఓటు ఇలా వేయాలి..
● ఓటర్లు వారు ఓటు వేసే అభ్యర్థికి ఎదురుగా బ్యాలెట్ పేపర్లో ఎన్నికల సంఘం సరఫరా చేసిన వాయిలెట్ స్కెచ్పెన్ ద్వారా మాత్రమే ఓటు వేయాలి.
● ఎంచుకున్న అభ్యర్థికి ఎదురుగా 1, 2, 3, 4 ప్రాధాన్య క్రమంలో మాత్రమే అంకెల రూపంలో ఓటేయాలి.
● మొదటి ప్రాధాన్య ఓటుగా 1వ అంకెను అభ్యర్థికి ఎదురుగా ఉన్న స్థలంలో మాత్రమే మార్కు చేయాలి. ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నా, బ్యాలెట్ పేపర్లో పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లకు ఎదురుగా 1, 2, 3 వంటి అంకెల రూపంలో మాత్రమే ప్రాధాన్య క్రమంలో ఓటేయాలి.
ఇలా చేయకూడదు...
● బ్యాలెట్ పేపర్లో ఇద్దరు అభ్యర్థులకు మొదటి ప్రాధాన్య ఓటు 1వ సంఖ్య ఇవ్వకూడదు.
● బ్యాలెట్ పేపర్పై సంతకం చేయడం, ఇనిషియల్ వేయడం, పేరు, అక్షరాలు వంటివి రాయకూడదు.
● బ్యాలెట్ పేపర్పై 1, 2, 3, 4, 5 సంఖ్యల రూపంలో మాత్రమే ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. పదాల రూపంలో, వన్, టూ, త్రీ అని రాయకూడదు.
● బ్యాలెట్ పేపర్పై రైట్ మార్క్ టిక్ చేయడం లేదా ఇంటూ మార్కు పెట్టడం వంటివి చేయకూడదు.
● ఒకే అభ్యర్థికి రెండు ప్రాధాన్యాలు ఇవ్వకూడదు. ఉదాహరణకు ఒకే అభ్యర్థికి 1, 2 సంఖ్యలు వేయకూడదు.
● బ్యాలెట్ పేపర్పై అభ్యర్థికి కేటాయించిన స్థలంలో గాక ఇతర ప్రాంతాల్లో 1, 2, 3 అంకెలు వేయకూడదు.
పెద్దపల్లిలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఎన్నికల సామగ్రిని సరిచూసుకుంటున్న ఎన్నికల సిబ్బంది
మొత్తం పోలింగ్ కేంద్రాలు 773
పట్టభద్రుల కేంద్రాలు: 499
టీచర్స్ కేంద్రాలు: 274
ఉమ్మడి కేంద్రాలు 93
మైక్రో అబ్జర్వర్లు: 394
జోనల్ అధికారులు: 335
ప్రిసైడింగ్ అధికారులు: 864
అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు: 2606
మొత్తం పోలింగ్ సిబ్బంది: 4,199
పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో 56మంది
ఓటర్లు
3,55,159
టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో
15మంది
ఓటర్లు 27,088
Comments
Please login to add a commentAdd a comment