
మాట్లాడుతున్న ఎమ్మెల్యే అంబటి, పక్కన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ డొక్కా
సత్తెనపల్లి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుది ముమ్మాటికీ చంద్రబాబు చేసిన హత్యేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్పై టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను అంబటి తీవ్రంగా ఖండించారు. అభ్యంతరకరంగా, అమానవీయంగా సీఎంను, మంత్రులను దూషించడం సమంజసం కాదన్నారు. అవాకులు, చవాకులు పేలితే ప్రజలు నాలుక తెగ్గోస్తారని హెచ్చరించారు. అయ్యన్న తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదా ఆయనకు పిచ్చెక్కిందని చంద్రబాబు ప్రకటించాలని కోరారు.
చదవండి: జోగి రమేష్పై టీడీపీ దాడి
కోడెల ఆత్మహత్యకు నెల ముందు బలవన్మరణానికి ప్రయత్నించి.. ఆయన అల్లుడి వైద్యశాలలో చికిత్స పొందితే పరామర్శించడానికి కూడా చంద్రబాబు రాలేదని గుర్తు చేశారు. అంతేకాకుండా పార్టీ నుంచి కోడెలను బయటకు సాగనంపాలని చూడటంతో కోడెల తీవ్ర మనస్తాపం చెందారన్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని స్పష్టం చేశారు. ఈ వాస్తవం సత్తెనపల్లి చుట్టుపక్కల వారందరికీ తెలుసన్నారు. అయ్యన్న ఇది గమనించాలని కోరారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను దుర్భాషలాడుతూ మాట్లాడటం అయ్యన్నలాంటి సీనియర్లకు పద్ధతి కాదని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ రాయపాటి పురుషోత్తమరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment