
సాక్షి, హైదరాబాద్: గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇంకో ఏడెనిమిది స్థానాలు అదనంగా గెలిచి ఉంటే తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వచ్చేదని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత నవంబర్ నుంచే కట్టొద్దని అన్నారు. ప్రస్తుతం తాను వారి మాటలనే గుర్తు చేశానని తెలిపారు.
తాను కరెంట్ బిల్లులు కట్టొద్దంటే డిప్యూటీ సీఎం భట్టి తనది విద్వంసకర మనస్తత్వం అని అంటున్నారని మండిపడ్డారు. నిజాలు మాట్లాడితే విద్వంసకర మనస్తత్వమా? అని ప్రశ్నించారు. కరెంటు బిల్లులు కాంగ్రెస్ నేత సోనియా గాంధీకే పంపుదామని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఇప్పటినుంచే ఒత్తిడి తేవాలని కార్యకర్తలకు తెలియజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సమాచార హక్కు వాడుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రగతి భవన్లో విలాస వంతమైన సౌకర్యాలూ అంటూ దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు భట్టి అందులోనే ఉంటున్నారని ఎద్దేవా చేశారు. మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశం నిర్వహించుకుందామని తెలిపారు.
కారు కేవలం సర్వీసింగ్కు వెళ్లి మళ్లీ రెట్టింపు వేగంతో పరుగెత్తుతుందని అన్నారు. పీఎం మోదీకి, సీఎం రేవంత్రెడ్డికి భయపడే పార్టీ బీఆర్ఎస్ కాదని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ గొంతుక బీఆర్ఎస్ను ఖతం చేయాలని చూస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు.. మైనారిటీల్లో ఉన్న అపోహలను తొలగించాలని కేటీఆర్ అన్నారు.
చదవండి: TS: ప్రభుత్వ సలహాదారుల నియామకం
Comments
Please login to add a commentAdd a comment