
మధురవాడ : భీమిలి నియోజకవర్గం మధురవాడలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలో భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ, టీడీపీ నాయకులు నమ్మి శ్రీను, జీవీఎంసీ 5వ వార్డు కార్పొరేటర్ తండ్రి, రాష్ట్ర బీసీ సెల్ నాయకుడు మొల్లి లక్ష్మణరావు తదితరులపై పీఎంపాలెం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
రంజాన్ సందర్భంగా గురువారం ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపే నెపంతో శివశక్తినగర్ రోడ్డులోని సద్గురు సాయినాథకాలనీలోలో ఉన్న మసీద్–ఇ– ఫిర్ధౌస్లో పార్టీ కండువాలు ధరించి భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ల ఫొటోలతో ఉన్న స్టిక్కర్లు అతికించి స్వీట్స్బాక్స్లు పంపిణీ చేశారు. వీటిని స్వయంగా గంటా కుమారుడు రవితేజ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మొల్లి లక్ష్మణరావు, నమ్మి శ్రీను తదితరులు పంపిణీ చేశారు. దీనిపై‘సాక్షి’ దినపత్రికలో ‘టిడీపీ బరితెగింపు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. భీమిలి హారి్టకల్చర్ ఆఫీసర్, నియోజకవర్గ ఎంసీసీ టీమ్–4 ఇన్చార్జ్ ఆర్పీ స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.
గంటా బావమరిదిపై చర్యలు తీసుకోవాలి
ఈ పంపిణీ వ్యవహారంలో గంటా బావమరిది జీవన్ కుమార్తో పాటు మరికొంత మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారని, వీరు పేర్లు ఫొటోలు కూడా పత్రికలో ప్రచురితమయ్యాయి. అయితే వారి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చలేదని విమర్శలు వస్తున్నాయి. మరింత లోతుగా విచారణ చేసి కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment