
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్(BRS Party) అంటే.. ‘బీ-ఆర్ఎస్ఎస్’ అని, ఆర్ఎస్ఎస్(RSS) ఐడియాలజీతో వెళ్లేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందంటూ సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ(BJP) చేస్తోన్నఆరోపణలనే తెలంగాణలో బీఆర్ఎస్ చేస్తోందని ఆయన విమర్శించారు. ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో బుధవారం.. సీఎం రేవంత్ పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ చెప్పినట్లు ఆర్ఎస్ఎస్తో తమది సిద్ధాంతపరమైన వైరుధ్యమన్నారు.
(ఐడియాలాజికల్ డిఫరెన్సెస్) స్వాతంత్య్రం కోసం ఆర్ఎస్ఎస్ ఏ పోరాటం చేయలేదని, వారెవరూ ఎటువంటి త్యాగాలు చేయలేదని రేవంత్ అన్నారు. స్వాతంత్య్రం గురించి ప్రశంసించేందుకు, చెప్పేందుకు వారు సిద్ధంగా లేరని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల వాస్తవ సిద్ధాంతమే అదని, మోహన్ భాగవత్ (ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్) అదే చెప్పారని, స్వాతంత్య్ర పోరాటంతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ, నేతలు త్యాగాలు చేసి స్వాతంత్య్రం తీసుకొచ్చారని, దేశాన్ని ముందుకు నడిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ చెప్పారని సీఎం వివరించారు.
స్వాతంత్య్రానికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే వారిపై చట్టపరమైన విచారణ చేయాలని, ఆ క్రమంలోనే మోహన్ భాగవత్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని సీఎం రేవంత్ అన్నారు. బీజేపీ వాళ్లు తప్పుడు ఆరోపణలు చేయడంలో దిట్టలని, అందుకే తాము భారతీయ ఝూటా (అబద్ధాలు) పార్టీ అంటున్నామని రేవంత్ పేర్కొన్నారు. బీజేపీ చెబుతున్న విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పని లేదని సీఎం అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: మీకు తెలియకుండా మీ అశ్లీల ఫొటోలు ఇన్స్టాలో!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మోహన్ భాగవత్తో ఉన్నారా? లేక దేశ స్వాతంత్య్రం కోసం అమరులైన లక్షలాది వెంట ఉన్నారా? స్పష్టం చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు కాంగ్రెస్పై ఆరోపణలు చేస్తూ స్వాతంత్య్రం విషయంలో మోహన్ భాగవత్ మాట్లాడిన అంశాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోహన్ భాగవత్పై చర్యలు తీసుకుంటారా లేదా దేశ ప్రజలకు స్పష్టం చేయాలని సీఎం డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నుంచి తాము నేర్చుకోవాల్సింది ఏం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో చట్టం తన పద్ధతిలో నడిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు. ఎక్కడైనా, ఎవరిపైనైనా దాడులు జరిగితే పోలీసులు చర్యలు చేపడతారని, శాంతి భద్రతల సమస్య తలెత్తితే పోలీసులు జోక్యం చేసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేశారని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హయంలో పోలీసులతో కలిసి బీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు చేశారని, తాము అలా చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎక్కడైనా తప్పు జరిగితే దానిని సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment