
హైదరాబాద్, సాక్షి: గాంధీ భవన్ వద్ద ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత, నటుడు అల్లు అర్జున్కు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్రెడ్డి.. పార్టీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో ఆయనకు భంగపాటే ఎదురైంది.
సోమవారం ఉదయం గాంధీభవన్కు చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన్ని కలిసేందుకు ఆమె విముఖత వ్యక్తం చేశారు. ప్రస్తుతం నడుస్తున్న పరిణామాల నేపథ్యంలో.. ఆమె కలిసేందుకు ఇష్టపడనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన గాంధీ భవన్ నుంచి వెనుదిరిగారు. ఈ సమయంలో మీడియాతో మాట్లాడానికి నిరాకరించిన చంద్రశేఖర్ రెడ్డి.. తాను కాంగ్రెస్లోనే ఉన్నానని, పార్టీ నేతలను కలవడానికి వచ్చానని మాత్రం చెప్పి వెళ్లిపోయారు.
ఇదిలా ఉంటే.. కంచర్ల చంద్రశేఖర్రెడ్డి చాలాకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. గతంలో బీఆర్ఎస్లోనూ పని చేశారు. ప్రస్తు కాంగ్రెస్ నుంచి నాగార్జున సాగర్ సెగ్మెంట్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈయన కూతురు స్నేహారెడ్డిని అల్లు అర్జున్కు ఇచ్చి 2011 మార్చి 6వ తేదీన వివాహం జరిపించారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు.
పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా.. అల్లు అర్జున్ అరెస్టై జైలుకు కూడా వెళ్లి.. మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు.
అయితే ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయంగానూ రచ్చ రేపింది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు అల్లు అర్జున్కు మద్ధతుగా నిలిచాయి. రేవంత్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయితే.. కాంగ్రెస్ మాత్రం పోలీసుల చర్యలను సమర్థిస్తూ..అల్లు అర్జున్దే మొత్తం తప్పు అంటూ వాదిస్తూ వస్తోంది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో హైడ్రామా
Comments
Please login to add a commentAdd a comment