
మాట్లాడుతున్న సీపీఐ నేత రామకృష్ణ
తిరుపతి కల్చరల్: రైతాంగాన్ని నిలువునా ముంచుతున్న బీజేపీకి త్వరలో జరగనున్న తిరుపతి ఉపఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకుండా చిత్తు చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. తిరుపతిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అన్నదాతల నడ్డి విరిచి కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులై బీజేపీని ఓడించాలని కోరారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 22 రాష్ట్రాల్లో 20 వేల కేంద్రాల్లో పోరాటం సాగుతోందన్నారు. 11 సార్లు రైతులను చర్చలకు పిలిచి కాలయాపన చేయడమే కాక ఏడాదిన్నరపాటు చట్టాలను అమలు చేయమంటూ చెప్పడం విడ్డూరమన్నారు. నాడు బీజేపీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని, విభజన సమయంలో పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని మాట్లాడిన జనసేన అధినేత పవన్కల్యాణ్.. నేడు అదే బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం సరికాదన్నారు. లౌకిక భావాలున్న పవన్ మతోన్మాద పార్టీ అయిన బీజేపీ నుంచి తక్షణం వైదొలగి, రైతాంగ ఉద్యమానికి మద్దతుగా నిలవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment