
సాక్షి, సిద్ధిపేట: మరికొన్ని గంటల్లో దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సిద్ధిపేటలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. కాగా స్థానికంగా ఉన్న స్వర్ణా ప్యాలెస్ హోటల్లో డబ్బులు పంచుతున్నట్లు సమాచారం ఉందంటూ బీజేపీ నేతలు అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అదే హోటల్లో బస చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, బీజేపీ నేతల మధ్య తోపుటలా జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు యత్నిస్తున్నారు.
బీజేపీ కార్యకర్తలు గూండాల్లా ప్రవర్తించారని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారని, తనను కొట్టే ప్రయత్నం చేస్తుంటే టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారని తెలిపారు. బీజేపీ దాడిలో టీఆర్ఎస్ కార్యకర్త గాయపడ్డారని పేర్కొన్నారు. దళిత ఎమ్మెల్యేపై దాడి హేయమైన చర్య మంత్రి హరీష్రావు మండిపడ్డారు. పథకం ప్రకారమే బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని అన్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటమి తప్పదని తెలుసుకున్న బీజేపీ నాయకులు దళిత బిడ్డలైన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై సిద్దిపేటలోనీ స్వర్ణ ప్యాలెస్లో దాడికి పాల్పటం హేయమైన చర్య అని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. ఈ దాడికి పాల్పడిన బీజేపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమీషన్, పోలీసు డిపార్టుమెంట్ను కోరుతున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment