
ఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని అక్టోబర్ 5కు మారుస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 1న పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా.. అక్టోబర్ 5కు మార్పు చేసింది. తొలుత అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టాలని నిర్ణయించగా.. జమ్మూకశ్మీర్తో పాటే అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడించననుంది.
బిష్ణోయ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. శతాబ్దాల నాటి అసోజ్ అమావాస్య ఉత్సవాల్లో పాల్గొనేందుకు హర్యానాలోని బిష్ణోయ్ కమ్యూనిటీ ప్రజలు రాజస్థాన్కు భారీగా తరలివస్తారు. దీంతో ఎన్నికల సంఘానికి జాతీయ, స్థానిక పార్టీలు.. అఖిల భారత బిష్ణోయ్ మహాసభల నుంచి వినతులు వచ్చాయి. దీంతో ప్రజాస్వామ్యంలో సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలన్న ఉద్దేశంతో పోలింగ్ తేదీలను మార్చినట్లు ఈసీ ప్రకటించింది.
హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లను బీజేపీ సాధించింది. దుష్యంత్ సింగ్ చౌతాలా నేతృత్వంలోని జననాయక జనతా పార్టీ (జేజేపీ)తో పొత్తు పెట్టుకుని అధికారం చేపట్టింది. ప్రస్తుత ఎన్నికల్లో అధికార బీజేపీ హ్యాట్రిక్ కొట్టడానికి ప్రయత్నిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment