
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి రాసిన లేఖపై మీడియా ముఖంగానే వివరణ ఇచ్చానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఆ లేఖ ఎలా లీక్ అయిందో తనకు తెలియదని.. ఇది మీడియాలో కూడా వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘిచినట్టు భావించి.. తర్వలోనే కమిటీ ముందుకు పిలుస్తామని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి శుక్రవారం వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. లేఖపై ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా, లేదా మీరు (చిన్నారెడ్డి) మీడియాలో వచ్చిన వార్తలను చూసి సుమోటోగా కంప్లైంట్ తీసుకున్నారా? అని ప్రశ్నించారు.
ఈ విషయం ఎందుకు మీడియా ముందు చెప్పలేదన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లి పెద్దపల్లి అభ్యర్థిని పార్టీలో చర్చించకుండా, పార్టీలైన్ దాటి డిక్లేర్ చేస్తే పీసీసీపై క్రమశిక్షణ కమిటీలోకి రాదా? అని నిలదీశారు. సొంత ఉమ్మడి జిలాల్లో ఒక ఎమ్మెల్యేగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న తనకు చెప్పకుండా కార్యక్రమం డిక్లేర్ చేసివస్తున్నానని ప్రకటిస్తే క్రమశిక్షణ కమిటలీ రాదా? అని ప్రశ్నించారు.
వరంగల్ పార్లమెంట్ ఇంచార్జి, తాను భూపాలపల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్నట్లు వార్తలో చూశాను. దీనిపై తనకు సమాచారం ఇవ్వలేదు మరి అది క్రమశిక్షణ కమిటీకి రాదా? అని అన్నారు. క్రమశిక్షణ పాటించని పీసీసీని క్రమశిక్షణలో తీసుకోవాలని చిన్నారెడ్డికి తెలీదా? అని సూటిగా ప్రశ్నించారు. క్రమశిక్షణ కమిటీ ముందు ఫస్ట్ రేవంత్రెడ్డిని పిలిచి తర్వాత తనను పిలిస్తే..తప్పకుండా హాజరవుతానని అన్నారు. చిన్నారెడ్డి మీడియా ముందు వచ్చి మాట్లాడారు కాబట్టే.. తాను క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డికి మీడియా ద్వారా జవాబు ఇస్తున్నానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment