‘మరీ ఇంత వెన్నుపోటు రాజకీయమా?’ ఇండియా కూటమిపై జేఎంఎం సంచలన ఆరోపణలు | JMM Pulls Out Of Bihar Assembly Elections Amid Seat-Sharing Row With RJD And Congress | Sakshi
Sakshi News home page

‘మరీ ఇంత వెన్నుపోటు రాజకీయమా?’ ఇండియా కూటమిపై జేఎంఎం సంచలన ఆరోపణలు

Oct 21 2025 7:33 AM | Updated on Oct 21 2025 11:40 AM

JMM Out From Bihar Elections 2025 Sensational Allegations On RJD

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమి (బీహార్‌ మహా ఘట్‌బంధన్‌) భాగస్వామి జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం)నేతలు కాంగ్రెస్‌, ఆర్జేడీలపై సంచలన ఆరోపణలు చేశారు. పొత్తులపై పునరాలోచన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు కూడా. ఏమైందంటే..

బీహార్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించక ముందే కాంగ్రెస్‌, ఆర్జేడీ, జేఎంఎంలు మహా ఘట్‌బంధన్‌ పేరుతో ఒక్కతాటిపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో సీట్ల పంపకం ఎంతకీ తెగలేదు. కాంగ్రెస్‌ పార్టీ తనకు 70కుపైగా సీట్లు కావాలని డిమాండ్‌ చేయడం, అన్ని సీట్లు ఇవ్వడం సాధ్యం కాదని ఆర్జేడీ భీష్మించుకున్నాయి. తరువాతి కాలంలో ఇరుపక్షాలు కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శించడంతో తగిన సమయంలోనే ఇరు పార్టీల మధ్య సీట్ల పంపిణీ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. ఇదిలా ఉంటే.. 

జార్ఖండ్‌ ముక్తి మోర్చా పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. తాము 12 సీట్లు కావాలని కోరామని, అయితే ఘట్‌ బంధన్‌ భాగస్వాములు సీట్ల పంపకంలో తమను అసలు లెక్కలోకే తీసుకోలేదని ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ సుప్రియో భట్టాచార్య ఆరోపించారు. మూడు రోజుల క్రితమే ఈ పార్టీ తాము అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని ప్రకటించిన సంగతి ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. సీట్ల పంపకంపై ఘట్‌ బంధన్‌ నుంచి స్పందన లేకపోవడంతోనే తామీ నిర్ణయానికి వచ్చినట్లు (జేఎంఎం) ప్రకటించింది. కాంగ్రెస్‌, ఆర్జేడీలపై ఒత్తిడి తెచ్చేందుకే చేసిన ఈ ప్రకటన ఫలితమేమీ ఇవ్వలేదు. నామినేషన్ల దాఖలుకు ఆఖరి గడువైన ఆదివారం కూడా సీట్ల పంపిణీ పంచాయతీ తేలలేదు. జేఎంఎం అభ్యర్థులనూ ప్రకటించలేదు. దీంతో ఆ పార్టీ ఈసారి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్టు అయ్యింది. 

ఈ నేపథ్యంలో జేఎంఎం కీలక నేత, జార్ఖండ్‌ మంత్రి సుదివ్య కుమార్‌ సైతం కాంగ్రెస్‌, ఆర్జేడీలపై విమర్శలు గుప్పించారు. సీట్ల పంపకంలో తమ పార్టీని పక్కన పెట్టారని.. వెన్నుపోటు రాజకీయం చేశారని ఆయన ఆరోపించారు. అభ్యర్థులను నిలబెట్టమని చెప్పకుండా, చివరి నిమిషం వరకు స్పష్టత ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. అంతేకాదు.. ఆర్జేడీ-కాంగ్రెస్‌లు ‘కూటమి ఒప్పందాన్ని’ సైతం గౌరవించలేదని అన్నారు.

తొలిసారి..
ఇదిలా ఉంటే.. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు జేఎంఎం దూరం కావడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. బీహార్‌-జార్ఖండ్‌ సరిహద్దు రాష్ట్రాల నియోజకవర్గాలైన జమై, చకాయి, ధమదాహా, మనిహారి, పిర్‌పైంటి, కటోరియా.. తదితర ప్రాంతాలలో ఆ పార్టీ క్రమం తప్పుకుండా పోటీ చేస్తుంటుంది. 2020 ఎన్నికల్లోనూ సొంతంగా పోటీ చేసినా ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. బీహార్‌ ఎన్నికల నుంచి జేఎంఎం తప్పుకోవడంపై బీజేపీ తీవ్ర ‍వ్యాఖ్యలు చేసింది. ‘‘బీహార్ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసిపోయింది. కానీ JMM ఒక్క అభ్యర్థిని కూడా బరిలో నిలపలేకపోయింది. భారీ ప్రకటనలు చేసే ఆ పార్టీ.. ఈసారి ఏం చేసింది?. జార్ఖండ్‌ పరువు ప్రతిష్టలను దిగజారుస్తూ సిగ్గులేకుండా వ్యవహరించారని BJP ప్రతినిధి ప్రతుల్ షాహ్దేవ్ మండిపడ్డారు.

ముదురుతున్న విబేధాలు..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల (2025) నేపథ్యంలో రాష్ట్రీయ జనతా దళ్ (RJD),  కాంగ్రెస్ మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు INDIA కూటమిలో భాగస్వాములు అయినప్పటికీ.. సీటు పంపకాలపై ఏకాభిప్రాయానికి రావడం లేదు. ఈ గందరగోళం మధ్య.. ఆర్జేడీ 143 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించుకుంది. అలాగే.. కాంగ్రెస్‌ 61 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగతా సీట్లలో వామపక్షాలకు, అలాగే.. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీకి 15 సీట్లు పోనున్నట్లు తెలుస్తోంది.  సీట్ల పంపకాలపై అధికారిక ప్రకటన.. స్పష్టత లేకపోవడంతో కాంగ్రెస్‌-ఆర్జేడీలు ఐదు నియోజకవర్గాల్లో ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయి. అలాగే.. కాంగ్రెస్‌ మరికొన్ని స్థానాలలో వామపక్షాల కూటమితోనూ పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీహార్ ఎన్నికలు నవంబర్ 6, 11వ తేదీల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న ఉంటుంది. నామినేషన్ల గడువు ముగియడంతో.. ప్రచార కార్యక్రమాలు ఇవాళ్టి (అక్టోబర్ 21) నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ముజఫ్ఫర్‌పూర్ నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. బీజేపీ నేతలు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు.

ఇదీ చదవండి: హోరాహోరీ పోరు! ఎలా ఉందంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement