![Malladi Vishnu Other YSRCP Leaders Condemn Attack On Mithun Reddy](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/18/Malladi-Vishnu-Other-YSRCP.jpg.webp?itok=3LS81kHi)
సాక్షి, తిరుపతి: కూటమి ప్రభుత్వ పాలన తాలిబన్ల పాలనను తలపిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. అధికారం చేపట్టి నెలతిరిగేలోపే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బతినడాన్ని ప్రశ్నిస్తున్నారు. తాజాగా టీడీపీ అరాచకాలకు పరాకాష్టగా నిలిచిన వినుకొండ దారుణ హత్యా ఘటన, ఎంపీ మిథున్రెడ్డిపై జరిగిన దాడుల్ని ఖండిస్తూ.. ఏపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
‘‘రాష్ట్రంలో సూపర్ సిక్స్పై దృష్టి పెట్టకుండా సూపర్ మ్యాజిక్ చేసి మోసం చేస్తున్నారని కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. కూటమి నాయకులు దళితులనే టార్గెట్ చేసి దాడులు చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఈ కూటమి తాలిబన్లను తరమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. కూటమి దాడులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి దాడులకు దిగితే తట్టుకోలేరని హెచ్చరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి బౌన్స్ బ్యాక్ అయి వస్తారని అన్నారు’’
::కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు
ఎంపీ మిధున్ రెడ్డిపై రాళ్ళ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు గొల్ల బాబారావు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో దాడులు హత్యలు పెరిగిపోయాయని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు సమంజసం కాదని, దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపై దాడులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ దాడులు చేస్తున్న వారికి సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు.
:::రాజ్యసభ సభ్యులు గొల్ల బాబారావు
చదవండి: పుంగనూరులో ఎంపీ మిథున్రెడ్డిపై టీడీపీ దాడి
ఎంపీ మిథున్ రెడ్డి పై టీడీపీ రాళ్లదాడిని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రంగా ఖండించారు. ఏపీ ప్రజలకు టీడీపీ నేతలు కొత్త విధానాలను పరిచయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు ఎక్కడా తిరగకూడదా ...టీడీపీ నేతలే ..కార్యకర్తలే తిరగాలా అని ప్రశ్నించారు. ఎంపీ మిథున్ రెడ్డి పై టీడీపీ మూకల దాడి హేయమైన చర్యగా పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బిహార్గా మార్చేశారని, ప్రజల అవసరాలను పక్కన పెట్టి ఇతర రాజకీయ పార్టీల నాయకుల పై దాడులు చేస్తున్నారని విమర్శించారు. ‘దాడులు , హత్యలు, మానభంగాలతో ఏపీ అట్టుడికిపోతోంది. పట్టపగలే హత్యలు చేస్తున్నారు. ఏపీలో పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది? ఎంపీ మిథున్ రెడ్డిని ముట్టడించి దాడి చేయాల్సిన అవసరం ఏముంది? వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి దౌర్జన్యాలు ఏనాడైనా జరిగాయా? తక్షణం గవర్నర్ జోక్యం చేసుకోవాలి. కేంద్రహోంశాఖ ఏపీలో శాంతి భద్రతల పై స్పందించాలి. 40 రోజుల నుంచి రాష్ట్రంలో దాడులతో రెచ్చిపోతున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఏమైపోయారు...ఎందుకు స్పందించడం లేదు. పోలీసు యంత్రాంగం నిర్లిప్తంగా ఉంది. ప్రజా ప్రతినిధులకు గన్ మెన్లను విత్ డ్రా చేసి శాంతిభద్రతలకు మీరే విఘాతం కలిగిస్తున్నారు. చంద్రబాబు గడచిన 40 రోజుల్లో జరిగిన సంఘటనలను కూడా కలిపి శ్వేత పత్రం విడుదల చేయాలి. పక్షంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన దాడుల పై మేమే శ్వేతపత్రం విడుదల చేస్తాం అని పేర్కొన్నారు.
:::మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
ఎంపీ మిథున్ రెడ్డి వాహనాలపై దాడి హేయమైన చర్య అని వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజలచే ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యుడు పివి మిథున్ రెడ్డి ఈ రోజు పుంగనూరు పర్యటనలో భాగంగా దళితుడైన మాజీ ఎంపీ రెడ్డెప్ప స్వగృహానికి వెళ్తే టి డి పి కి చెందిన వందలాది మంది వచ్చి రాళ్ళ దాడిచేసి వాహనాలను ధ్వసం చేయడం పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటీ నుంచీ వరుసగా జరుగుతున్న హత్యలు, దాడులు, ఆస్తుల ధ్వసం, కూల్చివేతల సంఘటనలు ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు జరగలేదన్నారు. ఈ పరిస్థితులను పోలీసులు వెంటనే చక్కదిద్దే భాద్యతను తీసుకుని అందరికీ రక్షణ కల్పించాలని ఆయన కోరారు. వినుకొండలో అందరూ చూస్తుండగానే వైఎస్ఆర్ సిపి నాయకుడు రషీద్ ను అతి కిరాతకంగా హత్యచేయడం, తదితర సంఘటనలను చూస్తే ఈ రాష్ట్ర పరిస్థితి ఎక్కడికి పోతుందోనని ఆయన ఆందోళన, ఆవేదనను వ్యక్తం చేశారు. నెల రోజులుగా వరుసగా పసిపిల్లలపై అత్యాచారాలు జరగడం చాలా దురదృష్టకరం, బాధాకరమన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారానికి గురై, హత్యకు గురైన బాలిక మృతదేహ ఆచూకీని ఇంతవరకు కనుగొనకపోవడం దారుణమన్నారు.తక్షణమే ఇటువంటి సంఘటనలను సరిదిద్ది, శాంతి భద్రతలను కాపాడి ప్రజల కోసం పనిచేసే విధంగా ప్రభుత్వం నిరూపించుకోవాలన్నారు.
:::మాజీ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు మాట్లాడుతూ.. ఎంపీ, ఉభయగోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ నేతలు చేతుల్లో గాయపడ్డ వైఎస్ఆర్సిపి కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లిన ఎంపీపై దాడి చేయడం హేయమైన చర్య. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ఎంపీకే భద్రత లేని విధంగా రాష్ట్రంలో పాలన సాగుతుందనీ ప్రజలు గమనిస్తున్నారు. వినుకొండలో వైఎస్ఆర్సిపి కార్యకర్త హత్య రాష్ట్రంలో రాక్షస పాలనకు అద్దం పడుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 40 రోజుల్లో జరిగిన దాడులు హత్యలకు చంద్రబాబు బాధ్యత వహించాలి. మా కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దు.
:::కంభం విజయరాజు
Comments
Please login to add a commentAdd a comment