రాజ్యాంగాన్ని మార్చే కుట్ర | Sakshi
Sakshi News home page

రాజ్యాంగాన్ని మార్చే కుట్ర

Published Wed, May 1 2024 5:27 AM

MP Asaduddin Owaisi comments over bjp

దేశ విచ్ఛిన్నానికి ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలు 

దళితులు, ముస్లింల వ్యతిరేకి బీజేపీ 

హైదరాబాద్‌లో అరాచకం సృష్టించేందుకు ఆ పార్టీ నేతల యత్నాలు 

ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపణ 

గోల్కొండ: ప్రపంచంలోనే అత్యుత్తమమైన భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని మజ్లిస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు, హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చేతుల్లో కీలు»ొమ్మ అయిన బీజేపీ దళితులు, ముస్లింలకు పక్కా వ్యతిరేకి అని విమర్శించారు. 

మంగళవారం గోల్కొండ ఎండిలైన్స్‌ చౌరస్తా వద్ద జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌భగవత్‌ ఒకొక్కటిగా తమ ఎజెండాను అమలు చేస్తూ దేశ విచ్చిన్నానికి కుట్రలు చేస్తున్నారని నిందించారు. గత పదేళ్ల పాలనలో దళితులు, ముస్లింల సంక్షేమానికి ఏమీ చేయని పీఎం మోదీ ఇప్పుడు వారి రిజర్వేషన్లను సైతం రద్దు చేసేందుకు పక్కాగా ప్లాన్‌ చేశారని విమర్శించారు. 

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం నాయకుల హత్యాకాండ నేరుగా అక్కడి ప్రభుత్వాల కనుసన్నల్లోనే కొనసాగుతోందని ఒవైసీ ధ్వజమెత్తారు. ముస్లిం నేతలు అరెస్టయి జైలుకు వెళ్లే వారు సజీవంగా తిరిగిరావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం నేతలను పోలీసులే చంపారని ఆయన గుర్తు చేశారు. 

నన్ను ఓడించేందుకు మోదీ, అమిత్‌ షా పాట్లు 
హైదరాబాద్‌లో అరాచక వాతావరణం నెలకొల్పేందుకు బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఒవైసీ ఆరోపించారు. హైదరాబాద్‌ స్థానం నుంచి తనను ఓడించేందుకు మోదీ, అమిత్‌ షాలు పడరాని పాట్లు పడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మతసామరస్యానికి పెట్టిన పేరైన హైదరాబాద్‌ ఓటర్లు ఎంతో వివేకవంతులనీ, శాంతిభద్రతలు నగర అభివృద్ధి కోరుకుని తనను గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మోహియుద్దీన్, కార్పొరేటర్‌ నసీరుద్దీన్, మహ్మద్‌ గౌస్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement