
కేంద్రం ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. టెక్సాస్లోని యూనివర్సిటీలో ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తూ ప్రధాని మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విమర్శలు గుప్పించారు.
అయితే రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఇతర దేశాల్లో భారతదేశాన్ని అవమానించే అలవాటు గాంధీకి ముందు నుంచే ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. దేశ ద్రోహులు ఆర్ఎస్ఎస్ గురించి అర్థం చేసుకోలేరని మండిపడ్డారు. భారతదేశం పరువు తీసేందుకే రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్ఎస్ఎస్ విధానాల గురించి తెలుసుకోవాలంటే రాహుల్ లాంటి వారికి ఎన్నో జన్మలు ఎత్తాల్సివస్తోందని అన్నారు. విదేశాలకు వెళ్లి దేశాన్ని విమర్శించే వారికి ఆర్ఎస్ఎస్ విధానాల గురించి తెలుసుకోలేరు. రాహుల్ ఎప్పటికీ ఆ వ్యవస్థ విధానాలను అర్థం చేసుకోలేరు. ఆరెస్సెస్ భారతదేశ విలువలు, సంస్కృతి నుంచి పుట్టిందని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు.
కాగా అంతకముందు రాహుల్ మాట్లాడుతూ.. భారత్ అంటే ఒకే ఆలోచన, భావజాలం అని ఆర్ఎస్ఎస్ నమ్ముతుందని, మహిళలు కేవలం ఇంటి పనికి, వంట పనికి మాత్రమే పరిమితమని భావిస్తుందని మండిపడ్డారు. మహిళలు అన్నిరంగాల్లో ముందుకువెళ్లాలని, భారత్ అంటే భిన్న భావజాలం అని తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
భారత్లో బీజేపీ, ప్రధాని మోదీకి ఎవరూ భయపడరనే విషయాన్ని ఇటీవల జరిగిన ఎన్నికలు నిరూపించాయన్నారు. భారత సంప్రదాయాలు, భాషలపై బీజేపీ దాడి చేస్తోందని ఆరోపించారు. మన రాజ్యాంగంపై ప్రధాని మోదీ దాడి చేస్తున్నారని ప్రజలు గ్రహించారని, మోదీ, బీజేపీకి ఎవరూ భయపడటం లేదని అన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు అనంతరం దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్పై వ్యతిరేక పోరాటం స్పష్టంగా కనిపించిందని రాహుల్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment