
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో గ్యారంటీ కార్డు స్కీం అమలు తీరు గురించి తెలంగాణ ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఆ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై బీజేపీసహా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కొన్ని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పరిపాలన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరించడం ద్వారా తాము ఇక్కడ అధికారంలోకి వస్తే హమీలను కచ్చితంగా అమలు చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
ఇందుకోసం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డి.కె.శివకుమార్ త్వరలోనే హైదరాబాద్కు రానున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన పర్యటనలో భాగంగా గ్యారంటీ కార్డు స్కీంల అమలుపై సెమినార్ నిర్వహిస్తామని, కర్ణాటకలో ఏం జరుగుతుందన్న దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శివకుమార్ వివరిస్తారని గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని, త్వరలోనే ఆయన హైదరాబాద్కు వస్తారని తెలుస్తోంది.